ఆంధ్ర ప్రదేశ్

పవన్ కళ్యాణ్ బాసటగా…. అడవి తల్లి బాటతో ముగిసిన డోలీ కష్టాలు…

Published by
Suresh Thota

దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో, కనీస రహదారి సౌకర్యం లేక అల్లాడుతున్న గిరిజన గ్రామాల్లో నేడు కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత, “చివరి గిరిజన గ్రామానికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలి” అన్న తన ఉక్కు సంకల్పాన్ని అక్షరాలా అమలు చేసి చూపిస్తున్నారు. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అడవి తల్లి బాట” మరియు “పల్లె పండుగ” కార్యక్రమాలు నేడు గిరిజన పల్లెల్లో రవాణా విప్లవానికి నాంది పలికాయి.

గిరి శిఖర గ్రామాల్లో సరైన రోడ్లు లేక గర్భిణీలను, రోగులను డోలీల్లో మోసుకెళ్లే విషాదకర దృశ్యాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరమగీతం పాడుతున్నారు. 1,005 కోట్లు ఖర్చు చేసి 625 గిరిజన ఆవాసాలను కలుపుతూ 1,049 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా డోలీల మీద ఆధారపడ్డ గ్రామాలు నేడు వాహనాల రాకపోకలకు సిద్ధమవుతున్నాయి.

కొండ కోనల్లో ఉన్న అత్యంత మారుమూల ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా, గిరిజనులకు విద్య, వైద్యం మరియు మార్కెటింగ్ సదుపాయాలు చేరువ కాబోతున్నాయి. ఈ రహదారుల మూలంగా గిరిజనులు, తమ వస్తువులకు, వ్యవసాయ ఉత్పత్తుల కు గిట్టుబాటు ధరలను అందుకోబోతున్నారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనను ఒక పండుగలా నిర్వహించాలన్నది డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకు అనుగుణంగానే, 3,853 కోట్ల భారీ వ్యయంతో 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు మరియు 1,331 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి, రికార్డు స్థాయిలో నిర్మాణాలను ప్రారంభించారు. గతంలో అరకొరగా సాగిన రోడ్ల పనులకు భిన్నంగా, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో అత్యంత నాణ్యతతో, పారదర్శకంగా పనులు జరుగుతున్నాయి. వర్షాకాలంలో కూడా బురదమయం కాకుండా పల్లె రోడ్లు నేడు అద్దంలా మెరుస్తున్నాయి.

గిరిజన ప్రాంతాల్లో రహదారి అంటే కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, అది వారి జీవనాధారం అని నమ్మిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల అటవీ ప్రాంతాల్లో పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా, గిరిజనుల సంస్కృతిని కాపాడుతూనే ఆధునిక వసతులు కల్పిస్తున్నారు. పర్యవేక్షణలో ఏమాత్రం రాజీ పడకుండా క్షేత్రస్థాయిలో అధికారులను నియమించారు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.