భారతీయ సంగీత సామ్రాజ్ఞి “ఎస్. జానకి” భువి నుండి దివికేగారు. భారతీయ చలనచిత్ర సంగీత వినీలాకాశంలో ఒక ధ్రువతార నేలకొరిగింది. తన అమృత గానంతో ఆరు దశాబ్దాల పాటు కోట్లాది మంది హృదయాలను ఓలలాడించిన ప్రఖ్యాత నేపథ్య గాయని, “సౌత్ ఇండియన్ నైటింగేల్” ఎస్. జానకి (88) శనివారం (జూలై 11, 2026) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మైసూర్ లోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే జనవరి 22, 2026న ఆమె ఏకైక కుమారుడు మురళి కృష్ణ కన్నుమూయడంతో, మనోవ్యధ తో జానకమ్మ మానసికంగా బాగా కృంగిపోయారు. ఆమె మరణ వార్తతో యావత్ సినీ ప్రపంచం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు, అభిమానులు విచారం లో మునిగిపోయారు. ఒక అద్భుతమైన “స్వర ఝరి” శాశ్వతంగా మూగబోయింది.
జననం మరియు సంగీత ప్రస్థానం
ఎస్. జానకి 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని రేపల్లె సమీపంలో గల పల్లపట్ల గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంపై అపారమైన మక్కువ పెంచుకున్న ఆమె, 1957 లో “విధియిన్ విలయాట్టు” అనే తమిళ సినిమాతో తన నేపథ్యగాన జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ మొదలైన ఆమె ప్రస్థానం ఐదు దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగింది. 55 ఏళ్లకు పైగా సాగిన ఈ సుదీర్ఘ సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సహా పలు భారతీయ భాషల్లో దాదాపు 50 వేలకు పైగా పాటలను పాడి రికార్డు సృష్టించారు.
వైవిధ్యభరితమైన జానకమ్మ “స్వర ఝరి” గంగా ప్రవాహం లా కొనసాగింది. ఆవిడ గానశైలి చాలా వైవిధ్యమైనది. ఏ తరహా భావాలనైనా, ఎలాంటి కఠినమైన స్వరాలనైనా తన గొంతుతో ఆవలీల గా, పలికించగల సామర్థ్యం ఆమె ప్రత్యేకత.
ఐదు తరాల వారధి…. అలనాటి మహానటి సావిత్రి ,జమున, ల నుంచి నిన్నమొన్నటి తరం హీరోయిన్ల వరకూ… ఏకంగా ఐదు తరాల హీరోయిన్లకి ఆమె తన గాత్రాన్ని అందించారు. తెరముందు కనిపించే హీరోయిన్ల వయసు, వారి హావభావాలకు అనుగుణంగా ఆమె స్వరం అతికినట్టు సరిపోయేది. అదీ ఆమె స్వర మహిమ. చిన్నపిల్లల కొంటెతనం, నవ వధువు సిగ్గు, ప్రేమికుల విరహం, తల్లి మాతృత్వపు లాలిపాట, పల్లెపడచు జానపదం, భక్తురాలి ఆవేదన, శాస్త్రీయ సంగీతపు గంభీరత… ఇలా ఒకటేమిటి నవరసాలను ఆమె తన గొంతుతో తొణికిసలాడించారు. మధురమైన సంగీతం నకు, ఆమె తిరుగులేని స్వరసంపదతో, కెరీర్ కు ఎదురులేకుండా సాగింది.
బాలు & ఇళయరాజాలతో త్రివేణి సంగమం…. సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన పాటలు భారతీయ సంగీత చరిత్రలో మైలురాళ్ళు. అలాగే గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలసి ఆమె పాడిన యుగళ గీతాలు ఇప్పటికే కాదు, ఎప్పటికైనా అజరామరమైనవే. వీరిద్దరి కాంబినేషన్ గీతాలు వింటే శ్రోతలు పరవశించిపోవాల్సిందే.
కేవలం గాయని మాత్రమే కాదు… ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి.