హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా తాజాగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ను చిరంజీవి వ్యక్తిగతంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సజ్జనార్ కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయిలో నిలవాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.
సజ్జనార్తో చిరంజీవి స్నేహం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇద్దరి మధ్య పరస్పర గౌరవభావం, అభిమానం ఉంది. గతంలో సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సమయంలో, కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న రోజులలో, ప్రజల్లో ప్లాస్మా దానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు మెగాస్టార్తో కలిసి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ స్నేహానికి ప్రతీకగా చిరంజీవి తాజాగా సజ్జనార్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సమావేశం సందర్భంగా సజ్జనార్ చిరంజీవి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నగర భద్రత, ప్రజా సేవ కోసం తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. చిరంజీవి కూడా పోలీసు వ్యవస్థ కష్టాలను గుర్తుచేస్తూ, ప్రజల శాంతి భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీసు అధికారుల సేవలను అభినందించారు.
ప్రస్తుతం మెగాస్టార్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా చిరంజీవి, ప్రేక్షకులను నవ్వించే, భావోద్వేగపరచే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రానున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరిలో థియేటర్లలో విడుదల కానుంది.
చిరంజీవి – సజ్జనార్ భేటీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల మధ్య హాట్ టాపిక్గా మారాయి. అభిమానులు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, “సామాజిక బాధ్యతతో ముందుకు సాగే ఇద్దరు స్ఫూర్తిదాయక వ్యక్తులు” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.