Kaantha Review కాంత రివ్యూ: వాటీజ్ థిస్ కిచిడీ!?
దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి.
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాంత’. ‘మహానటి’ తర్వాత మరోసారి చిత్రసీమ నేపథ్యంలో సినిమా చేశారాయన. భాగ్యశ్రీ బోర్సే నాయికగా, సముద్రఖని, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రానా, దుల్కర్ నిర్మాణ భాగస్వాములుగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి.
కథ:
టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్), ఆయన గురువు – దర్శకుడు అయ్యా (సముద్రఖని) మధ్య ఓ అంశంలో దూరం పెరుగుతుంది. మనస్పర్థలు ఏర్పడతాయి. గురువును మించిన శిష్యుడిగా ఎదిగిన మహదేవన్, గురువు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శాంత’ మళ్ళీ మొదలు కావడానికి కారకుడు అవుతాడు. ఆ చిత్రీకరణలో మళ్ళీ ఇద్దరి మధ్య గొడవలు మొదలు అవుతాయి. అప్పుడు కొత్త కథానాయిక కుమారి (భాగ్యశ్రీ బోర్సే) ఎవరి పక్షాన నిలబడింది? ‘శాంత’ చిత్రీకరణ చేస్తున్న స్టూడియోకు పోలీస్ అధికారి ఫోనిక్స్ (రానా దగ్గుబాటి) ఎందుకు వచ్చారు? కేసు ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ప్రచార చిత్రాలు చూసి తొలి తరం నటీనటుల మధ్య చిత్రసీమలో జరిగిన అంశాలు చెప్పారని అనుకుంటే పొరబడినట్టే. అటువంటిది ఏమీ లేదు. చిత్రసీమ నేపథ్యంలో ‘కాంత’ను తీశారు కానీ కథలో చిత్రసీమ పాత్ర ఏమీ ఉండదు. నేపథ్యం మార్చినా కథకు ఎటువంటి నష్టం ఉండదు. అసలు ఇదొక కథ కాదు. మొదటి నుంచి చివరకు వచ్చేసరికి రకరకాల మలుపులు తీసుకుంది.
తనను మించిన తారగా శిష్యుడు ఎదగడంతో గురువు అహం దెబ్బ తింటుంది. అది జీర్ణించుకోలేకపోతాడు. గురువు అహం దెబ్బ తీయాలని శిష్యుడు ప్రయత్నం చేస్తాడు. అహం నేపథ్యంలో మొదలైన కథ తర్వాత ప్రేమ వైపు తిరుగుతుంది. మధ్యలో వివాహేతర సంబంధంగా కనబడుతుంది. అక్కడి నుంచి హత్య – విచారణ వైపు మళ్ళుతుంది. దాంతో కథ కిచిడీగా మారింది. రెండిటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి మిగిలింది. అటు చిత్రసీమ నేపథ్యం, ఇటు థ్రిల్లింత ఇవ్వలేక చివరకు సినిమా చతికిలపడింది.
సాంకేతికంగా ఉన్నత విలువలు పాటించారు. ఛాయాగ్రహణం, ప్రొడక్షన్ డిజైన్ బావున్నాయి. కానీ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. కథకుడిగా సెల్వమణి సెల్వరాజ్ తడబడ్డారు. అది సినిమాపై ప్రభావం చూపించింది. నటుడిగా దుల్కర్ సల్మాన్ అద్వితీయ ప్రదర్శన చేయడంతో దర్శకుడి లోపాలు కొంత కవర్ అయ్యాయి.
టీకే మహదేవన్ పాత్రకు దుల్కర్ సల్మాన్ ప్రాణం పోశారు. నటుడిగా ఆయన్ను తప్ప ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేం. ఆయనతో పోటా పోటీగా నటుడు సముద్రఖని ప్రదర్శన ఉంది. అప్పటి చిత్రాల్లో నాయికగా భాగ్యశ్రీ బోర్సే చక్కగా కనిపించరు. నటిగా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. రానా దగ్గుబాటి తన పాత్రకు న్యాయం చేశారు.
తీర్పు:
అహం నుంచి ప్రేమ మీదుగా థ్రిల్లింత ఇవ్వాలని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ప్రయత్నించారు. కాని ఆలోచనలను తెరపై ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమయ్యారు. కిచిడీ కథ కామన్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఆ నిడివి నిద్ర తెప్పిస్తుంది.