‘ఇడ్లీ కొట్టు’ మూవీ రివ్యూ
హీరో ధనుష్ తానే దర్శకత్వం వహించి నటించిన చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. గతంలో 3 చిత్రాలను డైరెక్ట్ చేసిన ధనుష్ ఇప్పుడు తన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా ఇడ్లీ కొట్టు తీశారు. పెద్దగా ఆర్భాటాలు, పబ్లిసిటీ లేకుండా, థియేటర్లలో రిలీజ్ చేసారు. మరి ఇడ్లీ కొట్టు ఎలా ఉందొ ఇక్కడ చూద్దాం.
కథ:
మురళి (ధనుష్) తన ఊర్లో భవిష్యత్తు లేదని భావించి, తండ్రి శివకేశవులు (రాజ్కిరణ్) అభ్యంతరాల్ని పట్టించుకోకుండా నగరానికి వెళ్ళిపోతాడు. హోటల్ మేనేజ్మెంట్లో చదివి, తర్వాత బ్యాంకాక్లోని పెద్ద హోటల్ చైన్లో ఉద్యోగం సాధిస్తాడు. యజమాని విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (శాలిని పాండే)తో పెళ్లికి సిద్దమవుతాడు.
కానీ పెళ్లి కాబోయే సమయంలోనే తండ్రి మరణంతో ఊరికి తిరిగి వస్తాడు. తర్వాత తల్లి కూడా చనిపోవడంతో, తన తండ్రి కల అయిన ‘ఇడ్లీ కొట్టు’ తినుబండారాన్ని తిరిగి లేపాలని నిర్ణయించుకుంటాడు. ఇదే సమయంలో మీరా అన్న అశ్విన్ (అరుణ్ విజయ్) అహంకారంతో ఊరికి వచ్చి ఘర్షణ మొదలవుతుంది. మురళి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టగలడా? లేక అశ్విన్ ప్రతీకారం అతన్ని కూలదోస్తుందా?… చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
విశ్లేషణ:
హీరోగా మాత్రమే కాకుండా, దర్శకుడిగానూ ధనుష్ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే కథనం చెబుతున్న తీరు మాత్రం ఆశించిన స్థాయిలో నిలబడలేదు. గ్రామీణ నేపథ్యం, తండ్రి కలల కోసం తిరిగి ఊరికి వస్తున్న హీరో – ఈ పాయింట్ చాలా బలంగా ఉన్నా, చూపిన తీరు మాత్రం టీవీ సీరియల్ లా అనిపించేలా ఉందని చెప్పాలి.
కథలోని భావోద్వేగాలు సహజంగా రావాల్సిన చోట, బలవంతంగా మెలోడ్రామా నింపినట్టే అనిపిస్తుంది. ప్రేక్షకులు కనెక్ట్ అవ్వాల్సిన సన్నివేశాలు కూడా అలా జరగకపోవడం లోపం. ముఖ్యంగా ధనుష్ – అరుణ్ విజయ్ మధ్య కాంట్రఫ్రంట్ చాలా బలహీనంగా, ఊహించదగినట్టే సాగింది. మొదటి సగం బాగున్నప్పటికీ, ఆ తర్వాత గ్రాఫ్ తగ్గుతుంది. హీరో-విలన్ టెంప్లేట్ వివాదంగా మారతాయి. ఇక్కడే సినిమా దారి తప్పి పట్టు కోల్పోతుంది.
ధనుష్ మురళిగా సాలిడ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కానీ అది కొత్తదనాన్ని ఇవ్వలేదు. అయితే రాజ్కిరణ్ పాత్ర మాత్రం మనసుకు హత్తుకునేలా వచ్చింది. నిత్యా మీనన్, సముద్రఖని, పార్తిబన్ వంటి వారు ఉన్నా, వారి పాత్రలు పెద్దగా ఏమి కనిపించలేదని చెప్పాలి.
జి.వి. ప్రకాష్ కుమార్ పాటలు డీసెంట్గా ఉన్నాయి, కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాటోగ్రాఫర్ కిరణ్ కౌశిక్ గ్రామీణ దృశ్యాలను చక్కగా చిత్రించారు.
తీర్పు:
‘ఇడ్లీ కొట్టు’లో ఇడ్లీలు రుచిగా ఉన్నా, సినిమా మాత్రం రుచిలేని వంటకం లా అనిపిస్తుంది. 1980ల మెలోడ్రామా స్టైల్ను మళ్లీ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించినా, ఆ మాధుర్యం లేకుండా సాగింది. ఈ చిత్రం మూలాలను మరియు తల్లిదండ్రుల ప్రేమను మరచిపోకూడదని సందేశం ప్రేక్షకులకు మునుపటి చిత్రాలను గుర్తు చేస్తుంది. మొత్తం మీద, ధనుష్ ఒక ఆశయంతో తీసిన ఈ సినిమా ఫీల్గుడ్ ఫ్యామిలీ డ్రామాగా రాకపోగా, బోరింగ్ అనిపించేలా తయారైంది.