పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘స్పిరిట్’ ఒకటి. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ పోలీస్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. ‘స్పిరిట్’ సినిమాలో కత్రినా కైఫ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారట. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథను కీలక మలుపు తిప్పే రోల్గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. పూర్తి స్థాయి కాప్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కత్రినా కూడా ఖాకీ లుక్లో కనిపించే అవకాశముందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఈ వార్త నిజమైతే.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నట్లవుతుంది. గతంలో ఆమె విక్టరీ వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’, నందమూరి బాలకృష్ణతో ‘అల్లరి పిడుగు’ చిత్రాల్లో నటించి మెప్పించారు. అనంతరం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ తెలుగు సినిమాలకు దూరమయ్యారు.
అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తలపై కత్రినా కైఫ్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, లేదా చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారం మాత్రమే. దీనిపై స్పష్టత రావాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
ఇక ‘స్పిరిట్’ చిత్రంలో హీరోయిన్గా ‘యానిమల్’ ఫేమ్ తృప్తి డిమ్రి నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘కల్కి 2’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.
ఒకవేళ కత్రినా కైఫ్ నిజంగానే ‘స్పిరిట్’ టీమ్లో చేరితే.. ప్రభాస్-కత్రినా కాంబినేషన్ తొలిసారి వెండితెరపై కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.