సినిమా వార్తలు

పేట్రియాట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్

Published by
Srinivas

మలయాళ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ZEE5లో ఈ చిత్రం జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకుడు Mahesh Narayanan తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ సినీ దిగ్గజాలు Mammootty, Mohanlal 18 ఏళ్ల తర్వాత కలిసి నటించడం విశేషం. అలాగే Nayanthara, Fahadh Faasil, Kunchacko Boban కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

గూఢచర్యం, రాజకీయాలు, టెక్నాలజీ, భావోద్వేగాలు, నాటకీయతల మేళవింపుగా రూపొందిన ‘పేట్రియాట్’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నిఘా వ్యవస్థలు, ప్రైవసీ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తుంది. దేశ భద్రత కోసం అత్యాధునిక నిఘా వ్యవస్థను రూపొందించిన వ్యక్తి, అదే వ్యవస్థను నిరపరాధులపై మోసం, బ్లాక్‌మెయిల్, నియంత్రణ కోసం వాడుతున్నారని తెలుసుకున్న తర్వాత తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటాడు. నిజాన్ని బయటపెట్టడం దేశద్రోహమా? లేక అదే అసలైన దేశభక్తా? అనే ఆసక్తికరమైన ప్రశ్నల చుట్టూ కథ నడుస్తుంది.

భారతీయ సామాజిక-రాజకీయ నేపథ్యాన్ని ఆధారంగా తీసుకున్నప్పటికీ, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా రూపొందిందని చిత్రబృందం చెబుతోంది. భారీ కుట్రలు, భావోద్వేగాలు, అధికార రాజకీయాల మధ్య జరిగే మానసిక సంఘర్షణలను దర్శకుడు మహేష్ నారాయణన్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. Revathi, Rajiv Menon, Darshana Rajendran తదితరులు కూడా కీలక పాత్రల్లో నటించారు.

దర్శకుడు మహేష్ నారాయణన్ మాట్లాడుతూ.. “ప్రజలను రక్షించడానికి రూపొందించిన టెక్నాలజీ చివరకు నియంత్రణకు ఆయుధంగా మారితే పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో ఈ సినిమాలో చూపించాం. ఒకప్పుడు పూర్తిగా నమ్మిన వ్యవస్థకే ఎదురు నిలవాల్సి వచ్చిన వ్యక్తి భావోద్వేగ సంఘర్షణ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

మమ్ముట్టి మాట్లాడుతూ.. “ఇది కేవలం రాజకీయ ఉత్కంఠభరిత చిత్రం మాత్రమే కాదు. మనసాక్షి, బాధ్యత, ధైర్యం గురించి చెప్పే బలమైన మానవీయ కథ. ప్రేక్షకులను ఆలోచింపజేసే అంశాలు ఇందులో ఉన్నాయి” అన్నారు.

మోహన్ లాల్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచంలో నిజం, అధికారం మధ్య జరుగుతున్న సంఘర్షణను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత మమ్ముట్టితో కలిసి నటించడం ప్రత్యేక అనుభూతి” అని పేర్కొన్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.