దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. మధ్య తరగతి సామాన్యుడి కథను వెండితెరపై అసాధారణ కావ్యంగా మలచగలిగిన అరుదైన సృజనశీలి, ‘స్క్రీన్ప్లే కింగ్’ కె. భాగ్యరాజ్ (73) శనివారం (జూన్ 27, 2026) ఉదయం చెన్నైలోని తన నివాసంలో అకస్మాత్తుగా సంభవించిన తీవ్ర గుండెపోటు (Cardiac Arrest) కారణంగా కన్నుమూశారు. గుండెపోటు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఇటీవల వరకూ ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటూ… మొన్ననే ప్రముఖ నటి కుష్బూ కుమార్తె వివాహ వేడుకకు కూడా హాజరై అందరినీ పలకరించిన ఆయన, ఇంతలోనే హఠాన్మరణం చెందడం యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి పట్ల తమిళనాడు గవర్నర్తో పాటు, ప్రముఖ సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు అగ్ర నటులు, మెగాస్టార్ “చిరంజీవి” మొన్న గోవా లో కుష్బూ , సుందర్ ల కూతురు వివాహ వేడుక లో కలిశామని, సరదాగా మాట్లాడుకున్నామని ఇంతలోనే ఈ దురదృష్ట కరమైన ఈ వార్త తనను షాక్ కు గురి చేసినట్లుగా సోషల్ మీడియా వేదిక గా ఆయన ఆవేదన తెలియజేశారు.
భారతిరాజా స్కూల్ నుండి “స్క్రీన్ప్లే మాంత్రికుడి” వరకు..
కృష్ణస్వామి భాగ్యరాజ్ అనే పూర్తి పేరున్న ఆయన… తన సినీ ప్రయాణాన్ని దిగ్గజ దర్శకుడు భారతిరాజా వద్ద సహాయ దర్శకుడిగా ప్రారంభించారు. ఆ తర్వాత కథా, సంభాషణల రచయితగా తన ప్రతిభను చాటుకుంటూ స్వయంగా దర్శకుడిగా మారారు. ఇటీవలే ఆయన గురువు భారతిరాజా మరణించగా, ఇప్పుడు ఆయన ప్రియశిష్యుడు భాగ్యరాజ్ కూడా కన్నుమూయడం తమిళ చిత్రసీమలో ఒక శకం, ఒక అద్భుతమైన తరం కనుమరుగైందని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని, ఆవేదనను తెలియజేస్తున్నారు.
పెద్ద బడ్జెట్లు, భారీ సాంకేతిక హంగులు లేకపోయినా… కేవలం బలమైన కథ, సహజమైన పాత్రలు, అద్భుతమైన స్క్రీన్ప్లేతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని నిరూపించిన మాంత్రికుడు ఆయన. ఒకే కథలో ప్రేమ, త్యాగం, నైతికత, కుటుంబ బంధాలు, మానసిక సంఘర్షణలను మేళవించడం భాగ్యరాజ్ ప్రత్యేకత. 25కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన, 75కు పైగా చిత్రాల్లో నటుడిగానూ రాణించారు. కేవలం రచన, దర్శకత్వానికే పరిమితం కాకుండా నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, నవలా రచయితగా బహుముఖ ప్రజ్ఞను చాటారు.
ఆయన కథలు విశ్వవ్యాప్తం…
”ముందనై ముడిచ్చు” (Munthanai Mudichu), “అంద ఏడు నాట్కళ్” (Andha 7 Naatkal), “చిన వీడు”, “సుందర కాండం”, “మౌన గీతాలు”, విశేషంగా ప్రజాదరణ పొంది తమిళ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. “అమితాబ్ బచ్చన్” ప్రధాన పాత్రలో ఆయన హిందీలో తెరకెక్కించిన “ఆఖ్రీ రాస్తా” ఎంతటి ప్రభంజనం సృష్టించి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మధ్యతరగతి జీవితాలను, సామాన్య మనుషుల భావోద్వేగాలను సున్నితమైన హాస్యంతో జోడించి ప్రేక్షకుడిని నవ్విస్తూనే ఆలోచింపజేయడం ఆయన రచనా బలం. అందుకే ఆయన చిత్రాలు ఇతర దక్షిణ భారత భాషలతో పాటు హిందీలోకి రీమేక్ అయి దేశవ్యాప్తంగా విజయాలు సాధించాయి. తమిళనాడు ప్రభుత్వ అవార్డులతో పాటు ఎన్నో ఫిల్మ్ఫేర్ పురస్కారాలు ఆయన ప్రతిభకు దక్కిన గౌరవాలు.
తెలుగు ప్రేక్షకులతో అనుబంధం..
తెలుగు చిత్రసీమతో, తెలుగు ప్రేక్షకులతో భాగ్యరాజ్ కి విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన కథల ఆధారంగా తెలుగులో “సుందర కాండ”, “ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు”, “అబ్బాయి గారు”, లాంటి ఎన్నో చిత్రాలు ఆయన కథలతో ఇక్కడి ప్రేక్షకులను అలరించాయి. మధ్య తరగతి కుటుంబాల నుండి, వారి జీవన శైలిని, వారి పత్రాలను, ఆయన చాలా హృద్యంగా వెండి తెరపై ఆవిష్కరించేవారు. ఆయన అనుసరించిన స్క్రీన్ప్లే, కథా శైలిని ఆదర్శంగా తీసుకుని టాలీవుడ్లో ఎందరో దర్శకులు, రచయితలు తమ సినీ ప్రయాణాన్ని విజయాలతో మలుచుకున్నారు.
వ్యక్తిగత జీవితం..
ప్రముఖ నటి పూర్ణిమా భాగ్యరాజ్ను వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు శాంతను భాగ్యరాజ్ నటుడిగా రాణిస్తుండగా, కుమార్తె శరణ్య కూడా సినీ రంగంతో ముడిపడి ఉన్నారు. సినీ పరిశ్రమలో ఎంతో గౌరవప్రదమైన కుటుంబంగా వీరికి పేరుంది.
ముగింపు: దర్శకులు మారవచ్చు, నటులు మారవచ్చు, సాంకేతికత మారవచ్చు… కానీ బలమైన కథలు చెప్పే కథకులు ఎప్పటికీ చిరంజీవులుగానే మిగిలిపోతారు. కె. భాగ్యరాజ్ భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సృష్టించిన పాత్రలు, రాసిన సంభాషణలు, నేర్పిన స్క్రీన్ప్లే పాఠాలు రాబోయే తరాల సినీ దర్శకులకు ఎల్లప్పుడూ దిక్సూచిలా ఉంటాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది.
తెరపై నవ్వులను, గుండె నిండా భావోద్వేగాలను నింపిన ఆ “స్క్రీన్ప్లే రారాజు”కు నిండు మనసుతో నివాళులు అర్పిద్దాం.