సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ: ఈడీ అధికారులకు అన్ని వివరాలు ఇచ్చా

Published by
Rahul N

హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో విజయ్ దేవరకొండ రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్‌కి మాత్రమే ప్రచారం చేశానని స్పష్టంచేశారు. ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరైన ఆయన, అధికారుల ప్రశ్నలకు సమాధానమిస్తూ సంబంధిత కాంట్రాక్టు కాపీలు, బ్యాంక్ లావాదేవీలు సహా అన్ని అవసరమైన డాక్యుమెంట్లు అందజేశానన్నారు.

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌ల మధ్య స్పష్టమైన తేడా ఉంది. ఈ అంశాన్ని సమాజానికి స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత మీడియా మిత్రులపై ఉంది” అని పేర్కొన్నారు.

“నేను ప్రచారం చేసినది ఏ23 అనే రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్. ఇది ఇండియన్ క్రికెట్ టీమ్, ఒలింపిక్స్ టీమ్, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ లాంటి ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లకు స్పాన్సర్‌గానూ పనిచేస్తోంది. ఈ యాప్‌కి ప్రభుత్వ అనుమతులున్నాయి. నేను అందించిన సమాచారంతో ఈడీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు” అని చెప్పారు.

విజయ్ దేవరకొండ అభిప్రాయపడుతూ, “దేశంలో ఏది సరైనది, ఏది తప్పుడు దాని నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు ఉంది. న్యాయపరమైన ప్రక్రియను నేను గౌరవిస్తున్నాను” అని తెలిపారు.

Rahul N

Recent Posts