మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో నటించిన ‘గవర్నర్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1990లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియమితులైన రామన్ పరిస్థితులను ఎలా చక్కదిద్దారనే కాన్సెప్ట్తో ఈ చిత్రం రూపొందింది. సినిమాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి. పైగా మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో నటించడం కూడా సినిమాపై అంచనాలు మరింత పెరిగేందుకు కారణమైంది. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? చూద్దాం.
కథేంటంటే..
1990 సంవత్సరంలో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఒకవైపు ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. మరోవైపు ఇంధన ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి, విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. దేశం దివాలా తీయబోతుందనే భయం ప్రజల్లో నెలకొంటుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో, ఆర్బీఐ గవర్నర్గా ఏ. రామన్ (మనోజ్ బాజ్పేయి) నియమితులవుతారు. కేవలం 30 రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అతని భుజాలపై పడుతుంది. ఒత్తిడి, రాజకీయ సవాళ్లు, కీలక నిర్ణయాల మధ్య అతను ఎలా పోరాడారు? ఆ సమయంలో ఆయన ఎలాంటి రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు? దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టారనేదే కథ.
సినిమా ఎలా ఉందంటే..
‘గవర్నర్’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు; భారత ఆర్థిక చరిత్రలో చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం. ఒక ఒక ఉత్కంఠభరితమైన బయోగ్రాఫికల్ థ్రిల్లర్గా దీనిని చెప్పాలి. ‘ది సైలెంట్ సేవియర్’ అనే ట్యాగ్లైన్తో రూపొందిన ఈ చిత్రాన్ని అద్భుతంగా దర్శకుడు చిన్మయ్ మాండ్లేకర్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం మనోజ్ బాజ్పేయి వన్ మ్యాన్ షోగా చెప్పాలి. ఆయనే సినిమాకు ప్రాణం పోశారు. ఎక్కడా కూడా పెద్దగా సినిమాటిక్ లిబర్టీ అనేది తీసుకున్నట్టుగా కనిపించలేదు. సంక్లిష్టమైన ఆర్థిక, రాజకీయ పరిణామాలను సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పేందుకు చిన్మయ్ మాండ్లేకర్ యత్నించారు కానీ కొన్ని ఆర్థిక పదాలు, కొన్ని టెక్నికల్కు సంబంధించిన చర్చలు మాస్ ప్రేక్షకులకు అర్థం కావడం కష్టమే. కానీ కథలోని భావోద్వేగ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే సినిమా స్లో నెరేషన్ కారణంగా ప్రేక్షకులకు కొంతమేర విసుగు తెప్పిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది. ఆర్థిక అంశాలపై ఫోకస్ చేయడం వలన ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ దక్కడం కష్టమే.
ఎవరెలా నటించారంటే..
మనోజ్ బాజ్పేయి తన పాత్రలో అద్భుతంగా నటించరనడం కన్నా జీవించారనడం మేలేమో. ప్రశాంతంగా కనిపించారు. అలాగే నాయకత్వ లక్షణాలను చాలా సహజంగా ప్రదర్శించారు. ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో అదితి వర్మ ఆకట్టుకుంది. ఆమె కనిపించే సన్నివేశాలన్నింటిలోనూ చక్కటి నటనను ప్రదర్శించారు.
ఆదా శర్మ జర్నలిస్టు అదితి వర్మ పాత్రలో ఆకట్టుకుంది. ఆమె కనిపించే ప్రతి సన్నివేశంలో మంచి ప్రభావం చూపుతుంది. మధు షా, క్రిషా కురుప్, పరితోష్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఇక జయంత్ వాడ్కర్ విషయానికి వస్తే చిన్న పాత్రలో కనిపించారు కానీ అద్భుతంగా నటించారు. ఆయన పాత్ర గుర్తుండిపోతుంది.
టెక్నికల్ పరంగా..
ముఖ్యంగా ఈ చిత్రం విషయానికి వస్తే చెప్పుకోవల్సింది దర్శకుడు చిన్మయ్ మాండ్లేకర్ గురించి. రాజకీయ, ఆర్థిక ఇతివృత్తాలను సమర్థవంతంగా తెరకెక్కించేందుకు యత్నించారు. భారత ఆర్థిక చరిత్రలోని ఒక అరుదైన అంశాన్ని నిజాయితీగా తెరకెక్కించారు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం మరింత సాగదీతగా అనిపిస్తాయి. ఇక నిర్మాత విషయానికి వస్తే ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతోంది. కాలానుగుణమైన సెట్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ విషయంలో కాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది.
తీర్పు: గవర్నర్ చిత్రం ఒక మంచి చారిత్రాత్మక డ్రామా.