సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పిరిట్యువల్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందింది. సినిమా నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ అన్నీ అంచనాలను పెంచేవిగానే ఉన్నాయి. పైగా సుమంత్ కూడా సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.
కథేంటంటే..
మహేంద్రగిరి రాజవంశానికి ఓ శాపం ఉంటుంది. ఆ శాపం కారణంగా 200 ఏళ్లుగా ఆ వంశంలో పుట్టిన ప్రతి మగ బిడ్డకు 33 తిథులు వచ్చిన నాడే మరణిస్తూ ఉంటారు. అదంతా వారాహి అమ్మవారి శాపం కారణంగానే జరుగుతోందని వారి నమ్మకం. ఆ వంశానికి చెందిన రాజేంద్ర (సిద్దు జొన్నలగడ్డ) చాలా మంచివాడు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉంటాడు. అతనికి 33వ తిథి వస్తుంది. ఆయన తల్లి శకుంతలా దేవి (మంజు భార్గవి).. ఇంట్లో నుంచి బయటకు వెళ్లవద్దంటుంది. కానీ రాజేంద్ర సోదరికి పురుటి నొప్పులు వస్తున్నాయని కాల్ వస్తుంది. అయినా సరే శకుంతలా దేవి బయటకు వెళ్లడానికి అంగీకరించదు. అప్పుడు రాజేంద్ర భార్య సుజాత (మాళవిక)కు కడుపులో నొప్పి వస్తుంది. ఆమెను తీసుకుని రాజేంద్ర హాస్పిటల్కు బయలుదేరాడు. మార్గమధ్యంలో కారుకు ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో రాజేంద్ర దంపతులు మరణిస్తారు. ఆ తరువాత శకుంతలా దేవి కూతురికి కొడుకు జన్మిస్తాడు. అతనికి నరేంద్రవర్మ (వంశీ చాగంటి) పేరు పెడతారు. మరోవైపు సిద్దార్థ్ (సుమంత్).. అతని స్నేహితుడు సత్యం (వెన్నెల కిషోర్)తో కలిసి యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటాడు. భక్తి ముసుగులో జరిగే మోసాలను వెలుగులోకి తీసుకు వస్తుంటాడు. సిద్దు అన్న రాజీవ్ (కమల్ కామరాజు)కు పెళ్లి కుదరుతుంది. అయితే రాజీవ్ జాతకంలో ఓ లోపం ఉందని దాని కోసం వారాహి అమ్మవారికి పూజ చేయాలని చెబుతారు. కుటుంబమంతా మహేంద్రగిరిలోని వారాహి అమ్మవారి ఆలయానికి వెళతారు. అదే సమయంలో నరేంద్రవర్మకు 33వ తిథి వస్తుంది. ఆయన పెంచుతున్న దున్నపోతే.. నరేంద్ర వర్మ, రాజీవ్లను ఆలయంలో చంపేస్తుంది. ఆ మరణాల మిస్టరీని ఛేదించేందుకు సిద్ధు సిద్ధమవుతాడు. అసలు రాజీవ్ని ఎందుకు చంపేసింది? మహేంద్రగిరి రాజవంశం ఎదుర్కొంటున్న శాపమేంటి? సిద్దు మిస్టరీలను ఛేదించాడా? అసలు ఆ మరణాలు దైవం కారణంగా జరుగుతున్నాయా? మనుషులే చేస్తున్నారా? వైష్ణవి (ఐశ్వర్యా రాజేష్) పాత్ర ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే…
ఏదో చేద్దామని ప్రారంభించి ఏం చేయాలో తెలియక.. ఏదేదో చేసినట్టుగా ఉంది. సినిమా ఆరంభం చూస్తుంటే ‘మురారి’ సినిమా గుర్తొస్తుంది. ఆ తరవాత కథ మరో మలుపు తీసుకుంటుంది. ఇలాంటి కథలు గతంలోనూ చాలా వచ్చాయి. అయితే ఒక ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా ఉంది. అది కూడా సరిగా వర్కవుట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం మరణాల గురించి చెబుతూ వచ్చాడు. అసలు కథంతా సెకండాఫ్లోనే చెప్పాడు. సెకండాఫ్లో శాపమేంటి? మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? వంటి అంశాలను చూపించారు. సెకండాఫ్ను బీభత్సంగా సాగదీశారు. అది మాత్రమే కాదు.. చివరిలో ఇక అయిపోతుంది అనుకున్నప్పుడల్లా సాగుతూనే ఉంటుంది. పోనీ ట్విస్ట్లేమైనా వర్కవుట్ అయ్యాయా? అంటే అవి కూడా మనం ఊహించగలిగేలానే ఉంటాయి. సినిమాలో ఎమోషన్ కూడా ఏమాత్రం వర్కవుట్ కాలేదు. అసలు కథలోనే క్లారిటీ లేదు. దర్శకుడు కథను ప్రెజెంట్ చేయడంలో పూర్తిగా తడబడ్డారు. హీరో సుమంత్ యూట్యూబ్ ఛానెల్ రన్ చేయడం, దానికి సంబంధించిన సన్నివేశాలతో కాలయాపన చేసినట్టుగా అనిపించింది. హీరో ఇన్వెస్టిగేషన్ను ఆసక్తికరంగానే ప్రారంభించినా కూడా ట్విస్ట్లు మెప్పించకపోవడంతో అది కూడా తేలిపోయింది. అలాగే వారాహి అమ్మవారికి సంబంధించిన మూమెంట్స్లోనూ మనల్ని అమితంగా ఆకట్టుకునే సన్నివేశాలేమీ లేవు. మొత్తంగా సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కష్టమే.
ఎవరెలా చేశారంటే..
సుమంత్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. బ్రహ్మానందం చాలా కాలం తర్వాత వెండితెరపై మెప్పించారు. మంజు భార్గవి కూడా చాలా నేచురల్గా నటించారు. వెన్నెల కిషోర్ అద్భుతంగా నటించారు. రాజీవ్ కనకాల, ఆలీ, వంశీ చాగంటి, కమల్ కామరాజు, శ్రీనివాస్ వడ్లమాని అంతా తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు సినిమాను ప్రెజెంట్ చేసిన విధానమే చాలా పెద్ద మైనస్. ఎడిటింగ్ సైతం అత్యంత పేలవం. చాలా సాగదీసినట్టుగా అనిపించింది. బీజీఎం బాగానే ఉన్నా.. పాటలు వర్కవుట్ కాలేదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
ఫైనల్గా.. ‘మహేంద్రగిరి వారాహి’ మెప్పించడం చాలా కష్టం