కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’. తమిళంలో ‘కరుప్పు’ టైటిల్తో రూపంందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక ఫిక్షనల్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో… న్యాయవ్యవస్థలోని లోపాలే ప్రధానాంశం. త్రిషకు ఇటీవలి కాలంలో సినిమాలు తగ్గిపోయాయి. సూర్యకు పెద్దగా సక్సెస్లు దక్కడం లేదు. మరి ఈ చిత్రం వీరిద్దరికీ సక్సెస్ను అందించిందా? చూద్దాం.
కథేంటంటే..
తమిళనాడు నుంచి మునిస్వామి నాయుడు (ఇంద్రాన్స్) తన కుమార్తె మీను (అనఘా మాయా రవి)తో కలిసి హైదరాబాద్కు వస్తాడు. ట్రైన్ నాంపల్లిలో ఆగడంతో అక్కడ దిగుతారు. తన కూతురు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ కోసమని 60 సవర్ల బంగారాన్ని తమతో తీసుకొస్తారు. వాటిని దొంగలు కొట్టేస్తారు. దీంతో పోలీస్ స్టేషన్లో మునిస్వామి, మీనులు కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు దొంగలను పట్టుకుని వారి వద్ద నుంచి తీసుకున్న 60 సవర్ల బంగారాన్ని తీసుకుంటారు. కానీ దానిలో 15 సవర్లు పోలీసులు తీసుకుంటారు. మిగిలన దాన్ని కోర్టులో రికవరీ చేసుకోమని చెబుతారు. దీనికోసం లాయర్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) నంబర్ను పోలీస్ ఇస్తాడు. అక్కడి నుంచి కథ కోర్టుకు మారుతుంది. బేబీ తనకంటూ ఆ కోర్టులో ఒక సామ్రాజ్యాన్నే నిర్మించుకుంటాడు. జడ్జి (నట్టి సుబ్రమణియన్)ని సైతం తన గుప్పెట్లో పెట్టుకుని తీర్పులు సైతం తనకు అనుకూలంగా ఇప్పించుకుంటూ ఉంటాడు. కేసు కోసం తనను సంప్రదించిన వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజేస్తూ ఉంటాడు. ఏ కేసును వెంటనే తేలనివ్వడు. అలా కొన్ని వేల కేసులు పెండింగ్లో పడిపోతాయి. బేబీ కృష్ణ మోసం కారణంగా తన కూతురు ఎక్కడ మరణిస్తుందో అన్న భయంతో మునిస్వామి కోర్టు ఆవరణలోని క్షేత్ర పాలకుడైన వీరభద్రుడిని వేడుకుంటాడు. అప్పుడు లాయర్ రూపంలో క్షేత్ర పాలకుడు వీరభద్రుడు (సూర్య) రంగప్రవేశం చేస్తాడు. మరి వీరభద్రుడు అన్యాయమైపోయిన వారికి న్యాయం చేస్తాడా? వీరభద్రుడికి, బేబీ కృష్ణకు మధ్య ఎలాంటి కథ నడుస్తుంది? మీను కథ ఏమైంది? కథలో ప్రీతి (త్రిష) ఎలాంటి పాత్ర పోషించింది. వంటి అంశాలను వెండితెరపై చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
ఆర్జే బాలాజీకి ఎందుకోగానీ దేవతలను దివి నుంచి భువికి తీసుకురావడమంటే మక్కువ అనుకుంటా. గతంలోనూ నయనతారతో‘అమ్మోరు తల్లి’ అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమా కథ కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. ‘అమ్మోరు తల్లి’ అయినా ‘వీరభద్ర’ అయినా అరాచకాన్ని ఎలా ఎదుర్కొన్నారన్నదే ప్రధానాంశం. ఇక ‘వీరభద్ర’ విషయానికి వస్తే సినిమా ప్రారంభమైన దాదాపు 40 నిమిషాల వరకూ హీరో ఎంట్రీ ఉండదు. సినిమాటిక్ లిబర్టీ బాగా ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది. భగవంతుడికి బోర్డర్స్ పెట్టడమనేది ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే భగవంతుడని తెలిసి కూడా బేబీ కృష్ణ.. వీరభద్రుడికి సవాల్ విసరడం మరో విచిత్రం.. సూర్య ఎంట్రీతో సినిమా వేగం పుంజుకున్నా కూడా ఆర్జే బాలాజీ తన పాత్రనే మరింత హైలైట్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. న్యాయవ్యవస్థను మరింత దారుణంగా ఈ సినిమాలో చూపించారు. న్యాయం కోసం ప్రజలు ఆశ్రయించే కోర్టులో అన్యాయం తాండవిస్తుంటే దానిని అణిచివేసేందుకు భగవంతుడే స్వయంగా రావడం అనేది ఆసక్తికరమే అయినా కూడా దానిని చూపించే విధానం కాస్త అతిగా అనిపించింది.
ఎవరెలా నటించారంటే..
సూర్య క్షేత్రపాలకుడిగానూ.. వీరభద్రుడిగా అద్భుతంగా నటించారు. వీరభద్రుడిగా కనిపించినప్పుడు మరింతగా ఆకట్టుకున్నారు. త్రిష విషయానికి వస్తే పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో నటించారు. కానీ నటన పరంగా ప్రత్యేకంగా చెప్పేదేముంది? చక్కగా నటించారు. ఆర్జే బాలాజీ తన పాత్రలో లీనమై నటించారు. అవడానికి సూర్య హీరో అయినా కూడా కథను మాత్రం తన చుట్టే నడిపించుకున్నారు. అనఘా మాయా రవి, ఇంద్రాన్స్, స్వాసిక తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు ఆర్జే బాలాజీ ఒక మంచి పాయింట్ను ఎంచుకున్నారు కానీ ప్రెజెంట్ చేయడంలోనే కొంత తడబడ్డారు. ముఖ్యంగా కొన్ని అంశాలు చాలా ఓవర్గా అనిపించాయి. అవి లేకుండా సాధారణంగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. స్క్రీన్ప్లే పరంగా కూడా సినిమా అంతలా ఆకట్టుకోలేకపోయింది.
ఇలాంటి సినిమాలకు బీజీఎం కీలకం. ఆ విషయంలో సాయి అభ్యంకర్ తన ప్రతిభను కనబరిచారు. సినిమాకు తగినట్టుగా బీజీఎం ఇచ్చారు. ముఖ్యంగా వీరభద్రుడు స్క్రీన్పై కనిపించినప్పుడల్లా ఆయన ఇచ్చిన ఆర్ఆర్ చాలా బాగుంది. అయితే పాటలు మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కావు. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగానే ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో కాస్త కత్తెరకు పదును పెట్టి ఉంటే బాగుండేది.
తీర్పు:
‘వీరభద్రుడు’కి తాండవమాడే ఛాన్స్ ఆర్జే బాలాజీ పెద్దగా ఇవ్వలేదు.