ఆంధ్ర ప్రదేశ్

అమరావతికి మరో మెగా ప్రాజెక్ట్.. పీఎన్‌బీతో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు

Published by
Rahul N

అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేకంగా క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ క్వాంటం మిషన్ మరియు పీఎన్‌బీ సీఈఓ, ఎండీ అశోక్ చంద్ర ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లో ఏర్పాటుకానున్న ఈ ఇన్నోవేషన్ హబ్ ద్వారా బ్యాంకింగ్ రంగంలో క్వాంటం కంప్యూటింగ్ ఆధారిత పరిశోధనలు, అత్యాధునిక ఆర్థిక సాంకేతిక పరిష్కారాల అభివృద్ధికి ఊతం లభించనుంది. భవిష్యత్ బ్యాంకింగ్ అవసరాలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీల అభివృద్ధి, సైబర్ భద్రత, డేటా ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది.

ఈ ఒప్పందంతో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుని క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్న తొలి బ్యాంక్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రికార్డు సృష్టించింది.

అమరావతిలో ఇప్పటికే రూపుదిద్దుకుంటున్న క్వాంటం వ్యాలీకి ఈ ప్రాజెక్టు మరో ప్రతిష్ఠాత్మక చేరికగా నిలవనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్, ఫిన్‌టెక్, డిజిటల్ బ్యాంకింగ్ రంగాల్లో దేశంలోనే ప్రముఖ గమ్యస్థానంగా ఎదిగే అవకాశాలు మరింత బలపడనున్నాయి.

Rahul N