జాతీయం

మహారాష్ట్ర లో సరికొత్త రాజకీయం…

Published by
Srinivas

పింప్రి–చించ్వడ్ (PCMC) ఎన్నికలతో మహారాష్ట్ర రాజకీయం సరికొత్త నాటకీయత సిద్ధమైంది. 29 మహా నగరపాలక సంస్థల ఎన్నికల సమరం మొదలైనది. ఉదా: బీఎంకే, PCMC, పూణే, నాగ్‌పూర్…. మొదటి దశ డిసెంబర్ మొదటి వారంలో పూర్తయ్యాయి…. రెండవ విడత గా పోలింగ్…15 జనవరి 2026 జరగబోతున్నాయి… ఓట్ల లెక్కింపు మాత్రం జనవరి 16వ తేదీన 2026న జరగబోతుంది.

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పవార్ స్టైల్ రాజకీయాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. డిప్యూటీ సీఎం మరియు NCP చీఫ్ అజిత్ పవార్ పింప్రి–చించ్వడ్ మునిసిపల్ ఎన్నికల్లో (NCP) శరద్ పవార్ వర్గంతో కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఇది ఇప్పుడు ఆసక్తికరం గా మారింది.

అజిత్ పవార్ ఒక ఎన్నికల ప్రచార సభలో ఇలా వ్యాఖ్యానించారు… మా కుటుంబ పరివారం కలసి ఈ ఎన్నికల్లో పోటీచేయబోతున్నాము. అభ్యర్థుల జాబితా ఖరారు చేసే సమయంలో మా రెండు NCP వర్గాలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం.. దీని వల్ల పార్టీ సంస్థాగతంగా, బలంగా మళ్లీ ఒక్కటవుతుంది. మహారాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాలి, సీట్ల పంపకం త్వరలో పూర్తి చేసి ప్రకటిస్తాం. ఇది కేవలం స్థానిక ఎన్నికల నిర్ణయం కాదు పవార్ కుటుంబ రాజకీయ పునఃఏకీకరణకు స్పష్టమైన సంకేతం గా భావించాలి.

ఒకప్పుడు శరద్ పవార్ “కింగ్ మేకర్” మహారాష్ట్ర రాజకీయాలలో, ఆయన పాత్ర పక్కనబెట్టి మహారాష్ట్ర రాజకీయాలను చూడలేము…. జాతీయ స్థాయిలో కూడా తనదైన శైలిలో పాత్ర పోషించారు. ఏ సోనియా గాంధీ తో విభేదించారో అదే కాంగ్రెస్ పార్టీ తో కలసి నడవడం వల్ల, ఆయనకు క్లీన్ ఇమేజ్ లేకుండా పోయింది. అజిత్ పవార్ NCP పార్టీ నీ చీల్చి…. ఆ పార్టీ గుర్తు చేజిక్కించుకోవడం ఆయనను దిక్కు తోచని స్థితిలోకి నెట్టివేసింది. తద్వారా తన కూతురు సుప్రియా సూలే పరిస్థితి అయోమయంలో పడిపోతుంది అని భావించి అజిత్ పవార్ తో చర్చలు జరిపి ఉండొచ్చు అంటున్నారు…. రాజకీయ విశ్లేషకులు.

ఇప్పటి రాజకీయ పరిణామాలను గమనిస్తే, బీజేపీతో శివసేన షిండే వర్గంతో కలసి…. అజిత్ పవార్ మహారాష్ట్రలో పరిపాలన మరియు అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరించారు. దీనితో యువత లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. దీనితో శరద్ పవార్ పునరాలోచనలో పడ్డారు. తనకి వయస్సు అయిపోతుంది అని గ్రహించి రాజీ యత్నానికి వచ్చి ఉంటారు అని రాజకీయ నిపుణుల భావన. అజిత్ పవార్ తో కలసి…. కేంద్ర రాజకీయాలలో తన కూతురు సుప్రియా సూలేకు మంత్రి పదవి ఇప్పించుకోవాలని ఆయన ఆశ… ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా తన కోరిక తీరే అవకాశం కనబడుతున్నది. రాబోయే కాలంలో సుప్రియా సూలే మోదీ ప్రభుత్వంలో మంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

శరద్ పవార్ రాజకీయ జీవితం ఒక్కసారి తరచి చూస్తే ఒక విషయం అర్ధం అవుతుంది… అధికారమే పరమావధి…. ఒకప్పుడు బాల్ ఠాక్రేతో సిద్ధాంత పర పోరాటం చేసి…. తరువాత ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాడితో పొత్తు పెట్టుకోవడం అసాధ్యం…. కాని 2.5 సంవత్సరాలు అదే పొత్తుతో ప్రభుత్వం నడిపారు. అన్ని ఆలోచించి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ కోలుకునే స్థితి కనపడటం లేదు అని భావించి ఉంటారు… ఇది ఇండియా కూటమికి పెద్ద దెబ్బ.

ఉద్ధవ్ సేన ఇప్పటికే బలహీనంగా ఉంది… ఇప్పుడు వారి ఉనికే ప్రశ్నార్థకంగా తయారు అయ్యింది. రేప్పొద్దున ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో ఉద్ధవ్ , రాజ్ పొత్తు పెట్టుకుని కూడా ఓడిపోతే ఇక ఆ పార్టీ మూసుకోవలసిందే.

ఈ కీలక తరుణంలో…. ఈ పరిణామాలపై శివసేన (షిందే వర్గం) మంత్రి సంజయ్ శిర్సత్ కీలకమైన వ్యాఖ్య చేశారు. “శరద్ పవార్ త్వరలో NDAలోకి రావడానికి ఇదే సూచన కావచ్చు. ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూస్తే ఇది ఆశ్చర్యకరం కాదు.” అంటే ఇది కేవలం పింప్రి–చించ్వడ్ ఎన్నికల విషయం కాదు మహారాష్ట్ర రాజకీయాల దిశ మారే సూచన అని నర్మ గర్భ వ్యాఖ్యలు చేశారు.

NDAలోకి శరద్ పవార్ వర్గం వస్తే 8 మంది లోక్‌సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్ లో NDA బలం 300 దాటుతుంది.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఒక నితీష్ కుమార్, ఒక చంద్ర బాబు, ఒక శరద్ పవార్, వీళ్ళు నీరు వంటివారు…. తమకు అనుకూలంగా ఎందులోనైనా ఒదిగిపోతారు.

సరైన సమయములో తీసుకునే నిర్ణయం, ఆ టైమింగ్ ని బట్టే అధికారం అందుకునే అవకాశం ఉంటుంది. పై వాళ్ళు ముగ్గురు ఇక “U” టర్న్ తీసుకునే అవకాశాలు ఇక ఉండకపోవచ్చు అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.