రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తర్వాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్పై కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్కు కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. విడుదలకు ముందు మీడియా కోసం రెండు ఎపిసోడ్లను ప్రత్యేకంగా ప్రదర్శించగా, అనంతరం గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ ఈ సిరీస్ తన కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు అనేక పాత్రలు చేసినప్పటికీ, ఈ పాత్రలో తన మాడ్యులేషన్, పాత్ర తీరు, డైలాగ్ డెలివరీ అన్నీ కొత్తగా ఉంటాయని చెప్పారు. దర్శకుడు కృష్ణ పోలూరు తనను పూర్తిగా భిన్నంగా ప్రెజెంట్ చేశారని పేర్కొన్నారు. సిరీస్లో అనేక ట్విస్టులు ఉంటాయని, ప్రేక్షకులను ఏ ఒక్కరినీ నిరాశపరచదని విశ్వాసం వ్యక్తం చేశారు.
నిర్మాత కె.వి. శ్రీరామ్ మాట్లాడుతూ ఈ సిరీస్ ప్రతి తండ్రికి, ప్రతి కుటుంబానికి కనెక్ట్ అవుతుందని అన్నారు. రాజీవ్ కనకాల పాత్రలో పూర్తిగా ఇమిడిపోయారని, ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్లా ఉత్కంఠభరితంగా ఉంటుందని చెప్పారు. జీ5 టీమ్ అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిదని తెలిపారు.
దర్శకుడు కృష్ణ పోలూరు వెల్లడిస్తూ, ఈ కథ మొదట ఒక లైన్గా ప్రారంభమై పూర్తిస్థాయి కథగా మారడానికి రెండేళ్లు పట్టిందని చెప్పారు. ‘రెక్కీ’ తర్వాత ఈ కథపైనే పని చేశానని, భావోద్వేగానికి థ్రిల్ను జోడించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో తెరకెక్కించామని తెలిపారు.
ఉదయభాను మాట్లాడుతూ ఈ సిరీస్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయాలనే కోరిక చాలా కాలంగా ఉందని, తల్లిగా ఈ పాత్రకు బలమైన అనుబంధం కలిగిందని తెలిపారు. ప్రతి కుటుంబం, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి కూతురు తప్పక చూడాల్సిన సిరీస్ అని అభిప్రాయపడ్డారు.
జీ5 తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ మాట్లాడుతూ తండ్రి కోణాన్ని ప్రధానంగా చూపించే కథలు అరుదుగా వస్తాయని, ఈ సిరీస్లో ఆ భావోద్వేగం బలంగా ఉండటమే తమను ఆకట్టుకుందని అన్నారు. విజువల్స్, డైలాగ్స్ సిరీస్కు మరింత బలం చేకూర్చాయని చెప్పారు.
కెమెరామెన్ మహేష్ అందించిన విజువల్స్, శృతి రాసిన డైలాగ్స్ కథకు భావోద్వేగాన్ని, ఉత్కంఠను మరింత పెంచాయని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. గాయత్రి భార్గవి, వాసంతిక తమ పాత్రలు కథలో ముఖ్యమైన మలుపులు తీసుకువస్తాయని తెలిపారు.
భావోద్వేగం, థ్రిల్, తండ్రి–కూతురు అనుబంధం సమ్మిళితమైన ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.