
తమిళ చిత్రసీమ ప్రముఖ దర్శకదిగ్గజం, నటుడు భారతీరాజా (84) జూన్ 10, 2026 న కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. 2025 మార్చిలో తన ఏకైక కుమారుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో మరణించడంతో, ఆ బాధతోనే, మానసిక వేదనతోనే భారతీరాజా ఆరోగ్యం క్షీణించిందని, ఆ బాధ నుండి కోలుకోలేకపోయారని తెలుస్తుంది.
భారతీయ చలనచిత్ర చరిత్రలో కొందరు దర్శకులు విజయవంతమైన సినిమాలను అందిస్తూ, వారు తమదైన ముద్ర వేసి ఒక కొత్త దారిని చూపిస్తారు. ఆ కోవకు చెందిన మహోన్నత దర్శకుడు తమిళ చిత్రసీమలో “దర్శకశిఖరం”గా గౌరవించబడే వ్యక్తి “భారతిరాజా”. తమిళ సినిమాను స్టూడియో లోని కృత్రిమ వాతావరణం నుండి బయటకు తీసుకువచ్చి, పల్లెల మధ్యకు తీసుకెళ్లి, పల్లె వాతావరణం, మట్టివాసనను వెండితెరపై గుబాళింప చేసిన మహోన్నత సృజనకర్తగా ఆయన చరిత్ర లో నిలిచిపోయారు.

1941 జూలై 17న తమిళనాడులోని అల్లినగరంలో జన్మించిన “భారతిరాజా” అసలు పేరు చిన్నస్వామి. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే కళల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. సినీరంగంలో అవకాశాల కోసం చెన్నై చేరకముందు ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశారు. అయితే కళలపై ఉన్న అభిరుచి ఆయనను చివరకు సినిమారంగంలోకి తీసుకువచ్చింది.
భారతిరాజా సినీ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం 1977లో విడుదలైన “16 వాయతినిలే”. ఈ చిత్రమే ఆయన తొలి దర్శకత్వ చిత్రం. అప్పటి వరకు ఎక్కువగా చిత్రీకరణలు స్టూడియోలకే పరిమితమై ఉండేవి. కానీ “భారతిరాజా” గ్రామాల్లోకి వెళ్లి అక్కడి జీవన విధానాన్ని, భాషను, మనుషుల భావోద్వేగాలను సహజత్వంతో చిత్రీకరించారు. ఇది తమిళ చిత్రసీమలో ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలికింది.
ఈ చిత్రం తరువాత తెలుగులో “పదహారేళ్ల వయసు” పేరుతో తెలుగులో రీమేక్ అయ్యింది. తమిళంలో సంచలనం సృష్టించిన ఈ కథ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. గ్రామీణ నేపథ్యం, సహజమైన పాత్రలు, హృదయాన్ని తాకే భావోద్వేగాలు ఈ చిత్రాన్ని చిరస్థాయిగా నిలబెట్టాయి.

భారతిరాజా చిత్రాల ప్రత్యేకత ఏమిటంటే, ఆయన కథల్లో మనిషి కేంద్రబిందువుగా ఉంటాడు. కుల వివక్ష, పేదరికం, ప్రేమ, కుటుంబ బంధాలు, మహిళల సమస్యలు, సామాజిక అసమానతలు వంటి అంశాలను ఆయన అత్యంత సహజంగా చిత్రీకరించారు. అందుకే ఆయన సినిమాలు కేవలం వినోదంగా కాకుండా సామాజిక చిత్రాలుగా ప్రసిద్ధి కెక్కాయి. వాటిలో “ముదల్ మరియధై”, “వేదం పుదితు”, “కరుత్తమ్మ”, “కీళక్కు చీమయిలే”, వంటి చిత్రాలు భారతిరాజా ప్రతిభకు నిదర్శనాలు. ముఖ్యంగా “వేదం పుధితు”లో కులవ్యవస్థపై ఆయన చేసిన విమర్శ, “కరుత్తమ్మా”లో బాలిక హత్యలపై ఆయన సంధించిన ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
జాతీయ స్థాయిలో కూడా భారతిరాజాకు విశేష గౌరవం లభించింది. ఆయన చిత్రాలు పలు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నాయి. “మొదల్ మరియాదై”, “వేదం పుధితు”, “కరుత్తమ్మా” వంటి చిత్రాలు భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. 2004లో భారత ప్రభుత్వం ఆయనకు “పద్మశ్రీ” పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించింది. “భారతిరాజా” సినీ ప్రస్థానం గురించి చెప్పేటప్పుడు సంగీత దర్శకుడు “ఇళయరాజా” పేరును ప్రస్తావించకుండా ఉండలేం. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. భారతిరాజా చూపించిన పల్లె అందాలకు ఇళయరాజా స్వరాలు ప్రాణం పోశాయి. వారి కలయికలో వచ్చిన ప్రతి చిత్రం లో సంగీతం కూడా కథలో ఒక పాత్రలా మారిపోయింది.

ప్రత్యేకంగా గ్రామీణ నేపథ్యంలోని చిత్రాల్లో “ఇళయరాజా” అందించిన సంగీతం ప్రేక్షకులను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లేది. పొలాలు,తోటలు, ప్రేమ, బాధ, ఆనందం ఇలా ప్రతి భావానికి ఆయన స్వరాలు జీవం పోశాయి. అందుకే “భారతిరాజా” మరియు “ఇళయరాజా” కలయికను భారతీయ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన దర్శకుడు మరియు సంగీత దర్శకుడి భాగస్వామ్యాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అలాగే ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు కె. భాగ్యరాజ్ కూడా భారతిరాజా శిష్యుడే. సహాయ దర్శకుడిగా ఆయన వద్ద పనిచేసిన భాగ్యరాజ్ తరువాత స్వతంత్ర దర్శకుడిగా ఎదిగి తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. “భాగ్యరాజా”లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన గురువుగా భారతిరాజాను ఆయన ఎప్పుడూ గౌరవంగా ప్రస్తావిస్తుంటారు. కొత్త కళాకారుల ను పరిచయం చేయడంలో కూడా భారతిరాజా పాత్ర అపారమైనది. రాధికా శరత్కుమార్, రేవతి, కార్తీక్, రఘువరన్, నెపోలియన్ వంటి అనేక మంది ప్రముఖులను ఆయన ప్రేక్షకులకు పరిచయం చేశారు. కొత్త ప్రతిభను వెతికి వెలుగులోకి తేవడం ఆయన ప్రత్యేక లక్షణం.
తెలుగు చిత్రసీమతో “భారతిరాజా”కు కూడా సన్నిహిత అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో నేరుగా రూపొందిన తెలుగు చిత్రాలలో హీరో కృష్ణ నటించిన చిత్రం “జమదగ్ని” ముఖ్యమైనది. అలాగే ఆయన రూపొందించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులోకి అనువదించబడి ఘన విజయాలు సాధించాయి. “ఎర్ర గులాబీలు” వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి.

తెలుగు దర్శకుల విషయానికి వస్తే, కె. విశ్వనాథ్ కు, భారతిరాజా కు దర్శకత్వశైలిలో కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి. విశ్వనాథ్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను తెరపై ఆవిష్కరించినట్లే, భారతిరాజా తమిళ గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించారు. అలాగే దాసరి నారాయణరావు వంటి ప్రముఖులతో కూడా ఆయనకు గౌరవ సంబంధాలు ఉండేవి.
సినిమా అనేది కేవలం వినోద సాధనం మాత్రమే కాదని, అది సమాజాన్ని ఆలోచింపజేసే శక్తివంతమైన మాధ్యమమని “భారతిరాజా” తన చిత్రాల ద్వారా నిరూపించారు. గ్రామీణ ప్రజల ఆశలు,ఆశయాలు, కష్టాలు, బంధాలు, సంప్రదాయాలు, సంఘర్షణలు అన్నింటినీ ఆయన తెరపై సజీవంగా నిలిపారు. నేడు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా, “భారతిరాజా” చిత్రాల్లో కనిపించే సహజత్వం, నేల వాసన, మానవీయత ప్రస్తుత చిత్రాల్లో కానరావడం లేదు. ఆయన చిత్రాలు ఒక తరం జ్ఞాపకాలు మాత్రమే కాదు, భారతీయ గ్రామీణ సంస్కృతికి దృశ్య రూపంలో నిలిచిన ప్రత్యేకమైన చరిత్ర పుటలు. అందుకే
