సినిమా వార్తలు

గద్దర్ అవార్డులు సినీ పరిశ్రమ బాధ్యతగా స్వీకరించాలి – దిల్ రాజు

Published by
Srinivas

తెలంగాణ ప్రభుత్వం ఎంతో కాలం తరువాత సినీ రంగాన్ని మరోసారి గౌరవించేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలుగు సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి, ప్రశంసించేందుకు ఈ అవార్డులు మళ్లీ ప్రవేశపెట్టడం సినీ ప్రియులందరికీ ఉత్సాహాన్నిస్తోంది.

అవార్డుల వేడుక ఈ నెల జూన్ 14న హైదరాబాద్‌ హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే వేదికను ఎంతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతుంది. లైవ్‌ టెలికాస్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు వీక్షించేందుకు అవకాశం కల్పించనున్నారు.

ఈసారి ప్రత్యేకంగా రెండు విభాగాల్లో అవార్డులు ఇవ్వబోతున్నారు:

మొదటిది: 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు సెన్సార్ పొందిన సినిమాల నుంచి ప్రతి ఏడాది మూడు ఉత్తమ చిత్రాలు ఎంపిక చేసి, వాటిలో పనిచేసిన హీరో, హీరోయిన్, దర్శకులు, నిర్మాతలకు అవార్డులు.

రెండవది: 2024లో విడుదలైన ఉత్తమ సినిమాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కూడా ప్రత్యేక గౌరవం.

ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్ రాజు మాట్లాడుతూ, “ఈ కార్యక్రమం ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకం. అదే సమయంలో, తెలుగు సినీ పరిశ్రమ బాధ్యతగా ముందుకు రావాలి. ఇది కేవలం అవార్డుల వేడుక కాదూ, ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం,” అన్నారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కొమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు పాల్గొననున్నారు. టాలీవుడ్‌ నుండి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

అవార్డుల జాబితా ఇప్పటికే ప్రకటించగా, అవార్డు పొందబోయే నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎంతో కాలం తరువాత ఈ స్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న గౌరవాన్ని వారు గర్వంగా భావిస్తున్నారు.

జూన్ 14న హైటెక్స్‌ వేదిక, తెలుగు సినిమాతో కళకళలాడనుంది!

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.