ప్రస్తుతం పరిశ్రమలో హాట్ హాట్ గా నడుస్తున్న టాపిక్ ఎగ్జిబిషన్ సెక్టార్. సింగిల్ స్క్రీన్స్ కు కూడా షేరింగ్ పద్ధతిన సినిమాలు ఇవ్వాలంటూ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిలింఛాంబర్ సెక్రటరీ ఓ కీలక ప్రకటన చేశారు. హీరోలు సినిమాల విషయంలో స్పీడ్ పెంచాలన్నారు. మరి ఇది సాధ్యమేనా?
పెద్ద హీరోలు ఎలాగూ స్పీడ్ పెంచలేరు. ఎందుకంటే, వాళ్ల సినిమాల బడ్జెట్స్ వేరు, వాళ్ల మార్కెట్ లెక్కలు వేరు. కానీ మిడ్ రేంజ్ హీరోలు కూడా సినిమాలు తగ్గించేశారు. అదే ఇప్పుడు సమస్య. చివరికి కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు కూడా గ్యాప్ తీసుకుంటే, థియేట్రికల్ సిస్టమ్ దెబ్బతినడం ఖాయం.
చిన్న హీరోలు, మిడ్ రేంజ్ హీరోలు ఏడాదికి కనీసం 2 సినిమాలైనా చేయాలి. అప్పుడే థియేటర్ల వ్యవస్థ మనుగడ సాగిస్తుంది. థియేటర్లకు ఫీడింగ్ ఉంటేనే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు. కాబట్టి ఇండస్ట్రీ నిలబడాలంటే కిరణ్ అబ్బవరం లాంటి మిడ్ రేంజ్ హీరోల చేతుల్లోనే ఉంది.
గతేడాది కిరణ్ అబ్బవరం చేసిన క, దిల్ రూబా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వాస్తవానికి వాటి ప్రొడక్షన్ ఏడాదిన్నర ముందుగానే మొదలైంది. అంటే 2022లో మొదలైన ఆ సినిమాలు రెండేళ్ల తర్వాత గతేడాది రిలీజ్ కు వచ్చాయి. ఇప్పుడు కె ర్యాంప్ అనే సినిమా చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం ఈ సినిమాకు కూడా చాలా టైమ్ పట్టేలా ఉంది. ఇలా చూస్తే కిరణ్ అబ్బవరం రెండేళ్లకు ఒక సినిమా చేసినట్లే.
ఇప్పటికే సినిమాలు ఓటీటీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వాళ్లు చెప్పినప్పుడు మాత్రమే విడుదల చేయాలనే పరిస్థితి వచ్చింది. ఈ పద్ధతి మారాలంటే చిన్న, మిడ్ రేంజ్ హీరోలు సినిమాల సంఖ్య పెంచాల్సిందే.