అనంతపురం నగరంలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్పై derogatory వ్యాఖ్యలు చేసినట్లు ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దుగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటిని ముట్టడించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో బయలుదేరారు.
ఈ పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు, ఎమ్మెల్యే నివాసం చుట్టూ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరానికి వచ్చే వాహనాలపై అదనపు తనిఖీలు చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తత దిశగా వెళ్లకుండా సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
గూడూరులో అభిమానులు ఆందోళనలకు దిగారు. ఎమ్మెల్యే వెంటనే పబ్లిక్గా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్యే ఇంటిపై, అలాగే టీడీపీ కార్యాలయంపై ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. పార్టీ హైకమాండ్ తక్షణమే జోక్యం చేసుకుని ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.
జిల్లా పోలీసులు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.