
టాలీవుడ్ స్టార్ నందమూరి తారక రామారావు జూ. (జూ. ఎన్టీఆర్) పేరు, గుర్తింపు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాణిజ్యంగా ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. జూ. ఎన్టీఆర్కు చెందిన వ్యక్తిత్వ హక్కులు మరియు ప్రచార హక్కులు చట్టపరంగా పూర్తిగా రక్షించబడతాయని కోర్టు తేల్చి చెప్పింది.
డిజిటల్ ప్లాట్ఫాంలు, సోషల్ మీడియా, ఈ-కామర్స్ వెబ్సైట్లలో జూ. ఎన్టీఆర్ పేరు, ఫోటోలు, బిరుదులు అనధికారికంగా వినియోగిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ను పరిశీలించిన కోర్టు, “NTR”, “Jr. NTR”, “Tarak”, “Nandamuri Taraka Rama Rao Jr.” వంటి పేర్లతో పాటు “Young Tiger”, “Man of Masses” వంటి బిరుదులు, ఆయన రూపురేఖలు, స్టైల్… ఇవన్నీ జూ. ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి చెందినవేనని స్పష్టం చేసింది.
జూ. ఎన్టీఆర్ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు ఉన్న నటుడని కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన పేరు లేదా చిత్రం ప్రజల్లో వెంటనే ఆయన్నే గుర్తుకు తెచ్చేలా ఉండటంతో, వాటిపై పూర్తి హక్కులు ఆయనకే చెందుతాయని తెలిపింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21, అలాగే కాపీరైట్ చట్టం–1957, ట్రేడ్మార్క్స్ చట్టం–1999 ప్రకారం ఈ హక్కులు చట్టబద్ధంగా పరిరక్షించబడతాయని పేర్కొంది. అంతేకాదు, ఐటీ చట్టం మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్–2021 మేరకు, ఫిర్యాదు వచ్చిన వెంటనే మధ్యవర్తి డిజిటల్ వేదికలు ఉల్లంఘన కంటెంట్ను తొలగించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
గుర్తింపు లేని ఖాతాలు లేదా అజ్ఞాత వ్యక్తులు (జాన్ డో ప్రతివాదులు) కూడా జూ. ఎన్టీఆర్ పేరు లేదా గుర్తింపును దుర్వినియోగం చేయరాదని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఏఐతో తయారు చేసిన చిత్రాలు, మార్పు చేసిన ఫోటోలు లేదా ఇతర డిజిటల్ కంటెంట్ ద్వారా లాభాలు పొందే ప్రయత్నాలు కూడా చట్టవిరుద్ధమేనని హెచ్చరించింది.
