తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్, సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి పావలా శ్యామల అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ప్రసాద్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు ప్రాథమిక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 78 ఏళ్ల పావలా శ్యామలకు హైపర్టెన్షన్, కరోనా ఆర్టరీ డిసీజ్ (CAD), పార్కిన్సన్స్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. రెగ్యులర్ మెడికేషన్ తీసుకోకపోవడంతో పాటు, మే 16, 2026 ఉదయం తీవ్రమైన కడుపు నొప్పి, రిగర్జిటేషన్, దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యలతో ఆమె ఆస్పత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు.
అనంతరం వైద్యులు వెంటనే ఆమెను అడ్మిట్ చేసి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆమెకు “అక్యూట్ సివియర్ గ్యాస్ట్రిటిస్” ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. అలాగే నిర్వహించిన అల్ట్రాసౌండ్ (USG Abdomen) పరీక్షలో కామన్ బైల్ డక్ట్ (CBD) విస్తరించి ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. దీనిపై మరింత స్పష్టత కోసం CECT Abdomen స్కాన్ నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు.
ప్రస్తుతం పావలా శ్యామలకు ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్తో పాటు అవసరమైన సపోర్టివ్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో క్లోజ్ మానిటరింగ్ కొనసాగుతోందని పేర్కొన్నారు.
మరిన్ని వైద్య పరీక్షలు, పరిశీలన అనంతరం పూర్తి స్థాయి ఆరోగ్య బులెటిన్ను రేపు విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు.