అంతర్జాతీయ దౌత్య చరిత్రలో భారత్ మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ (Royal Order of the Polar Star – Degree Commander Grand Cross) లభించింది. స్వీడన్లోని రెండవ అతిపెద్ద నగరమైన “గొథెన్బర్గ్”లో జరిగిన ఒక చారిత్రాత్మక వేదికపై, స్వీడన్ యువరాణి క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా ఈ అవార్డును ప్రధాని మోదీకి స్వయంగా బహూకరించారు. ఒక ఆసియా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ అధినేతకు (Head of Government) ఈ అత్యున్నత గౌరవం దక్కడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
చారిత్రక నేపథ్యం మరియు అవార్డు విశిష్టత
1748లో స్వీడన్ రాజు కింగ్ ఫ్రెడరిక్-1 చేత స్థాపించబడిన ఈ పురస్కారానికి అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్ట ఉంది. ఆకాశంలో స్థిరంగా ఉంటూ ప్రయాణికులకు దిశా నిర్దేశం చేసే ‘ధృవనక్షత్రం’ (Polar Star) లాగే, సమాజంలో విజ్ఞానాన్ని పంచుతూ, అంతర్జాతీయ శాంతి మరియు దేశాల మధ్య సత్సంబంధాల కోసం స్థిరంగా నిలబడే వ్యక్తులకుకు ఈ అవార్డును బహూకరిస్తారు. ఈ అవార్డుకు ఉపయోగించే సాంప్రదాయక నలుపు రంగు రిబ్బన్ వెనుక ఒక తాత్విక అంతరార్థం ఉంది. సమాజంలోని అజ్ఞానం అనే చీకటిని చీల్చుకుంటూ “విజ్ఞానం” అనే ధృవనక్షత్రం ఎలా ప్రకాశిస్తుందో ఈ అవార్డు గ్రహీత కూడా ప్రపంచానికి అలా మార్గదర్శి అని చెప్పడం దీని ఉద్దేశం. ఈ మెడల్పై లాటిన్ భాషలో “Nescit Occasum” (ఇది ఎప్పటికీ అస్తమించదు) అని లిఖించి ఉంటుంది. ఈ తాజా పురస్కారంతో ప్రధాని మోదీకి అంతర్జాతీయంగా లభించిన పౌర పురస్కారాల సంఖ్య 31 కి చేరింది.
గొథెన్బర్గ్ వేదిక: దౌత్య బంధాల బలోపేతం
సాధారణంగా దౌత్యపరమైన సమావేశాలు రాజధాని “స్టాక్హోమ్”లో జరుగుతుంటాయి. కానీ, ఈసారి వ్యూహాత్మకంగా “గొథెన్బర్గ్”లోని కౌంటీ గవర్నర్ నివాసాన్ని వేదికగా ఎంచుకున్నారు. స్వీడన్ ప్రధాని “ఉల్ఫ్ క్రిస్టెర్సన్”, రాయల్ ఫ్యామిలీ ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో భారత్-స్వీడన్ దేశాల మధ్య రక్షణ, అత్యాధునిక సాంకేతికత, హరిత ఇంధనం మరియు ద్వైపాక్షిక వ్యాపార రంగాలలో సహకారంపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
రవీంద్రనాథ్ ఠాగూర్ జ్ఞాపకాలు..
ఈ దౌత్య వేదిక కేవలం అధికారిక చర్చలకే పరిమితం కాలేదు; రెండు దేశాల సాంస్కృతిక బంధాన్ని కూడా పునరుజ్జీవింపజేసింది. సరిగ్గా వందేళ్ల క్రితం 1921, 1926లలో విశ్వకవి “రవీంద్రనాథ్ ఠాగూర్” స్వీడన్లో పర్యటించారు. ఆ చారిత్రక జ్ఞాపకార్థం, స్వీడన్ జాతీయ ఆర్కైవ్స్ నుండి సేకరించిన టాగూర్ చేతిరాతతో కూడిన కవితల నకళ్లను ఇరు దేశాల ప్రధానులు ప్రత్యేక బహుమతులుగా మార్చుకోవడం ఈ పర్యటనలోనే అత్యంత ఆకర్షణీయమైన ఘట్టంగా నిలిచింది.
స్వీడన్ రాజకీయ వ్యవస్థ – ఒక విలక్షణ శైలి
అవార్డు ప్రధానోత్సవంలో స్వీడన్ యువరాణి క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా స్వయంగా పాల్గొనడం వెనుక ఆ దేశ రాజ్యాంగ బద్ధమైన రాజకీయ వ్యూహం ఉంది. “స్వీడన్” దేశం కూడా “బ్రిటన్” తరహాలోనే “రాజరికం (Constitutional Monarchy)” మరియు “పార్లమెంటరీ ప్రజాస్వామ్యం” కలయికతో నడుస్తుంది. అక్కడ మన దేశం లాగా అధ్యక్షుడు ఉండరు. రాజు (ప్రస్తుత కింగ్ కార్ల్ XVI గుస్తాఫ్) దేశ అధినేతగా ఉంటారు. కానీ, పరిపాలనా అధికారాలన్నీ పార్లమెంటుకు, ప్రధానమంత్రికే ఉంటాయి. దేశ సంప్రదాయం ప్రకారం అంతర్జాతీయ వేదికలపై అత్యున్నత గౌరవాలను రాయల్ ఫ్యామిలీ సభ్యులే అందిస్తారు. అందుకే రాజు తరఫున యువరాణి విక్టోరియా ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ అంతర్జాతీయ పురస్కారం కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు, అంతర్జాతీయ వేదికపై మారుతున్న భారత దౌత్య పరపతికి, గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) నాయకుడిగా భారత్కు లభిస్తున్న గుర్తింపునకు ఇది నిదర్శనం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ “ఈ గౌరవం భారత్-స్వీడన్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధానికి, 140 కోట్ల భారత ప్రజల శ్రమకు దక్కిన ప్రతిఫలం.” అని శ్లాఘించారు.
ముగింపు: భౌగోళిక రాజకీయాల్లో సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో, ఐరోపాలోని ఒక కీలకమైన దేశం భారత్కు ఈ స్థాయి ప్రాధాన్యతనివ్వడం భవిష్యత్ వ్యూహాత్మక బంధాలకు సరికొత్త దిక్సూచి కానుంది