మెగా హీరో సాయి దుర్గ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. డిసెంబర్లోనే వివాహం జరగనుందనే రూమర్లు కూడా వినిపించగా, వాటన్నింటికీ హీరో స్వయంగా ముగింపు పలికారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఈ రోజు తిరుమల వెళ్లిన సాయి దుర్గ తేజ్, దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, “ఈ ఏడాది నా పెళ్లి జరగదు. నా వివాహం వచ్చే ఏడాదే జరుగుతుంది,” అని స్పష్టంగా తెలిపారు. అయితే పెళ్లి వివరాలు, వధువు గురించిన విషయాలు మాత్రం వెల్లడించలేదు.
అదే సమయంలో తన రాబోయే పాన్-ఇండియా మూవీ ‘సంబరాల యెతిగట్టు (SYG)’ గురించిన అప్డేట్ను కూడా పంచుకున్నారు. రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుందని, రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ కాలేదని చెప్పారు. “ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావొచ్చింది. సినిమా పట్ల నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది,” అని చెప్పారు.
ఆయన సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తుండగా, నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ళ, రవికృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.
2026 తన జీవితంలో వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ కీలక సంవత్సరం అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు సాయి దుర్గ తేజ్.