ఆంధ్ర ప్రదేశ్

ఉత్తరాన ఉన్న ఆ కాశికి మోడీ… దక్షిణాన ఉన్న ఈ కాశికి పవన్ కళ్యాణ్…

Published by
Suresh Thota

“పిఠాపురం” భారతదేశంలోని అత్యంత పురాతనమైన మరియు పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. దీని అసలు పేరు ‘పీఠికాపురం’. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన “పురుహూతికా దేవి శక్తి పీఠం” ఇక్కడ ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. తదనంతర కాలంలో “పీఠికాపురం” కాస్తా “పిఠాపురం” గా రూపాంతరం చెందింది. ఈ ప్రాంతాన్ని “దక్షిణ కాశీ” అని కూడా పిలుస్తారు. ఇది “శ్రీపాద శ్రీవల్లభ స్వామి” జన్మస్థలం కావడం వల్ల ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.

అటువంటి పుణ్యక్షేత్రాన్ని “పవన్ కళ్యాణ్” ఏరి కోరి తన నియోజకవర్గం గా “పిఠాపురం”ని ఎంచుకున్నారు. అక్కడ ప్రజానీకం కూడా అంతే స్థాయిలో స్వాగతించి ఆయన్ను గెలిపించి అసెంబ్లీ కి పంపించారు. ఆయన ఉప ముఖ్యమంత్రి గా అక్కడ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, తను ప్రాతినిధ్యం వహిస్తున్న “పిఠాపురం” నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మార్చాలని ఆయన కృషి చేస్తున్నారు. ఆయన ప్రధాన లక్ష్యం, పారదర్శకమైన పాలన మరియు స్థిరమైన అభివృద్ధి, దీనికే ఆయన పెద్దపీట వేస్తున్నారు. ​ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, పారిశ్రామికాభివృద్ధి మరియు ఆధ్యాత్మిక రంగాలకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను ఒకసారి పరిశీలిద్దాం.

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి గా ​ ప్రసిద్ధి చెందిన ఈ ఆధ్యాత్మిక క్షేత్రానికి, ప్రతి రోజు వేలాది మంది భక్తులు దేశ నలుమూలల నుండి వస్తుంటారు. అందులో భాగంగా, వారికి మౌలిక సదుపాయాలుకు గాను “అమృత్ భారత్” పథకం కింద రూ.37.25 కోట్లతో “పిఠాపురం రైల్వే స్టేషన్” ఆధునీకరణ చేపట్టారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ నవీకరణకు పనులు కూడా, శరవేగంగా జరుగుతున్నాయి.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో “పిఠాపురం” మున్సిపాలిటీని “సెలక్షన్ గ్రేడ్” కు, గొల్లప్రోలును “గ్రేడ్ 3” మున్సిపాలిటీగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. అలాగే ఉప్పాడ ​తీర ప్రాంత రక్షణ కు, ఉప్పాడ తీరంలో సముద్ర కోతను నివారించడానికి, రూ.323 కోట్లతో “సీ ప్రొటెక్షన్ వాల్” నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

కాకినాడ జిల్లా లో సుమారు 800 కోట్ల అంచనాలతో రహదారుల పనులు ప్రారంభమయ్యాయి. అందులో “​పిఠాపురం” నియోజకవర్గంలో సుమారు రూ.234 కోట్ల అంచనా వ్యయంతో 409 రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ​దీనికోసం నాబార్డ్, సాస్కీ, ఉపాధి హామీ మరియు ఆర్ అండ్ బీ నిధులను వినియోగిస్తున్నారు. ప్రజారోగ్యం కొరకు ​”పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌”ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా రూ.34 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అదనంగా 66 మంది వైద్య సిబ్బంది నియామకం జరిగింది, కార్పొరేట్ స్థాయి లో వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి రానున్నాయి.

కాకినాడ జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం “పవన్ కళ్యాణ్” ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం రూ.1663 కోట్లతో ఏలేరు రిజర్వాయర్ ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ​పిఠాపురం నియోజకవర్గంలో “జలజీవన్ మిషన్” కింద రూ.376 కోట్లు కేటాయించగా, నాగులపల్లి పథకం కింద 12 కోట్లు కేటాయించింది. దాని ద్వారా ఇప్పటికే పనులు పూర్తి అయ్యి గ్రామాలకు నీరు అందుతోంది.

గత 18 నెలల్లో “పిఠాపురం” కోసం సుమారు రూ.34,853 కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. పారిశ్రామికంగా అభివృద్ధి మొదలైంది.”​గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్” రూ.34,844 కోట్లతో ఒక భారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. చిన్న, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రూ.9.60 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేస్తున్నారు. యువతకు ఉపాధి కోసం ప్రత్యేకంగా “స్కిల్ హబ్” ఏర్పాటు చేసి సర్టిఫైడ్ కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా 23,105 మంది రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తున్నారు. అకాల వర్షాల కారణంగా, నష్ట పోయిన రైతులకు నష్టపరిహారంగా రూ.25.85 కోట్లు అందజేశారు.

చేబ్రోలు పట్టు రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, పట్టుగూళ్ల ఉత్పత్తి పెంచి రైతులకు కోటి రూపాయల వరకు ఆదాయం అందేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ​పాడి రైతుల కొరకు పశువైద్యశాలల నిర్మాణం, మరియు మత్స్యకార సంక్షేమం కోసం కోనపాపపేటలో శిక్షణ కేంద్రం, అమీనాబాద్‌లో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వంటివి చేపట్టారు.

“పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం”గా మార్చేందుకు రూ.20 కోట్లతో 19 ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో రూ.1.37 కోట్లతో మౌలిక వసతులు, బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో కార్పొరేట్ స్థాయి శిక్షణ కల్పిస్తున్నారు.

“పిఠాపురం” నియోజకవర్గాన్ని కేవలం ఒక రాజకీయ కేంద్రంగానే కాకుండా, పారిశ్రామికంగా, మరియు ఆధ్యాత్మికంగా అంటే ఆలయాల పునరుద్ధరణ తో సమతుల్యంగా అభివృద్ధి చేస్తూ ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” తన మార్కును చూపిస్తున్నారు. ఇది కేవలం ఒక నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే కాదు. ఇది “పవన్ కళ్యాణ్” అనే బ్రాండ్ కి నమూనా…..

ముగింపు: ఉత్తరాన ఉన్న కాశీ (వారణాసి)కి “నరేంద్ర మోడీ” ప్రాతినిధ్యం వహిస్తే… దక్షిణ కాశీ గా ఉన్న “పిఠాపురం” నకు “పవన్ కళ్యాణ్” ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన MP ఈయన MLA… అంతే మిగతాదంతా.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.