సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్‌తో సినిమా నా కలను నిజం చేసింది – రాశి ఖన్నా

Published by
Srinivas

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతుండగా, హీరోయిన్ రాశి ఖన్నా తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

“పవన్ కళ్యాణ్ సినిమా అంటే కథ వినకుండానే ఓకే”

ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నానని రాశి ఖన్నా తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అవకాశం రావడంతో కథ కూడా వినకుండా వెంటనే ఒప్పుకున్నానని చెప్పారు. మొదటి సినిమా చేసినప్పటి నుంచే పవన్ కళ్యాణ్‌తో పనిచేయాలని అనుకున్నానని, ఈ సినిమాతో ఆ కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.

“నా పాత్ర మోడరన్, మాస్ సాంగ్ కూడా ఉంది”

ఈ సినిమాలో తన పాత్ర పేరు ‘శ్లోక’ అని, అది మోడరన్ యువతి పాత్ర అని తెలిపారు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, తన పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉందని చెప్పారు. డ్యాన్స్ అంటే ఇష్టం ఉండటంతో మాస్ సాంగ్ షూట్‌ను ఎంతో ఎంజాయ్ చేశానని తెలిపారు.

“పవన్ గారి నుంచి మానవత్వం నేర్చుకున్నాను”

పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ వ్యక్తి అని, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉంటారని చెప్పారు. తక్కువ మాట్లాడినా ప్రతి మాటలో విలువ ఉంటుందని తెలిపారు. ప్రజా సేవ గురించి తనకు సూచనలు ఇచ్చారని, ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నానని చెప్పారు. అభిమానులు ఆయనను దేవుడిలా ఆరాధించడం చూసి ఆశ్చర్యపోయానని అన్నారు.

“హరీష్ శంకర్ చాలా స్మార్ట్ డైరెక్టర్”

దర్శకుడు హరీష్ శంకర్ గురించి మాట్లాడుతూ, ఆయనకు మాస్ పల్స్ బాగా తెలుసని తెలిపారు. సాధారణంగా ఎక్కువ రోజులు పట్టే షూటింగ్‌ను తక్కువ సమయంలో పూర్తి చేశారని చెప్పారు. సెట్స్‌లోనే పంచ్ డైలాగ్స్ రాసి ఇస్తారని, ఆయన అంకితభావం తనను ఆకట్టుకుందని అన్నారు.

“రెండు హీరోయిన్‌లు ఉన్నా ప్రతి పాత్ర ప్రత్యేకం”

శ్రీలీలతో కలిసి సన్నివేశాలు లేకపోయినా, ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. తన పాత్రలో కూడా మంచి వేరియేషన్స్ ఉంటాయని తెలిపారు.

“పవన్ కళ్యాణ్ డేట్స్‌కు అనుగుణంగా పనిచేశాను”

షూటింగ్ సమయంలో షెడ్యూల్స్ మారుతూ ఉండేవని, అవసరమైతే 24 గంటల షిఫ్టుల్లో కూడా పనిచేశానని తెలిపారు. ముందే దర్శకుడు చెప్పడంతో దానికి అనుగుణంగా అడ్జస్ట్ అయ్యానని చెప్పారు.

“మైత్రి నిర్మాతలు రాజీ పడరు”

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరని చెప్పారు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారని, ఆ బ్యానర్‌లో పని చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

“వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూస్తారు”

ఈ సినిమా ‘గబ్బర్ సింగ్’ తరహాలోనే ఎంటర్టైనింగ్‌గా ఉంటుందని, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాబోయే ప్రాజెక్టులు

ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్‌తో ఒక సినిమా, ‘ఫర్జీ 2’ వెబ్ సిరీస్ చేస్తున్నానని తెలిపారు. అమెజాన్ సిరీస్‌లో పంజాబీ పోలీస్ పాత్రలో నటిస్తున్నానని, అందులో అన్ని డైలాగ్స్ పంజాబీలోనే ఉంటాయని చెప్పారు. తమిళంలో ‘రౌడీ అండ్ కో’లో నటిస్తున్నానని, తెలుగులో కూడా కొన్ని కథలు వింటున్నానని వెల్లడించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.