వార్తలు

‘భారత్’కు ‘EU’తో స్వేచ్ఛా వాణిజ్యం ఖరారు…

Published by
Suresh Thota

భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై చర్చలు విజయవంతంగా ముగిశాయి.

ప్రస్తుత సమాచారం ప్రకారం, 2026 జనవరి 27న, ఢిల్లీలో జరిగిన భారత్ మరియు ఈయూ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మరియు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ “ఉర్సులా వాన్ డెర్ లేయెన్” ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ అడుగు పడింది. ఈ ఒప్పందం కోసం EU కమీషన్ ప్రెసిడెంట్ “ఉర్సులా” విపరీతమైన కృషి చేశారు. ఈమె 2019లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

2024లో ఆమె రెండోసారి (2029 వరకు) ఈ పదవికి తిరిగి ఎన్నికయ్యారు. భారత్ తో ఈ FTA సంబంధాలు కొనసాగడానికి ఈమె పాత్ర చాలా కీలకం.
యూరోపియన్ యూనియన్ (EU)లో ప్రస్తుతం మొత్తం 27దేశాలు ఉన్నాయి. ​గతంలో బ్రిటన్ (UK) కూడా ఇందులో సభ్య దేశంగా ఉండేది, కానీ 2020లో జరిగిన ‘బ్రెగ్జిట్’ (Brexit) తర్వాత ఆ దేశం ఈ కూటమి నుండి బయటకు వచ్చేసింది. 2026 రిపబ్లిక్ డే వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై, భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ ఒప్పందంలోని ప్రధానాంశాలు:

యూరప్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా మద్యం, లగ్జరీ కార్లు, చాక్లెట్స్, ఆలివ్ ఆయిల్ మరియు మెషినరీ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ​ఉదాహరణకు: వైన్‌ పై ప్రస్తుతం ఉన్న 150% సుంకాన్ని దశలవారీగా 20% నుండి 30%కి తగ్గించనున్నారు. ​లగ్జరీ కార్లపై ఉన్న 110% సుంకాన్ని 40%కి తగ్గించే అవకాశం ఉంది. ఇదే సమయంలో దేశీ ఆటో మొబైల్ రంగం దెబ్బతినకుండా చూసుకోవలసిన అవసరం కూడా ఉంది.

భారతదేశం నుండి ఎగుమతయ్యే దుస్తులు, జ్యువెలరీ,కెమికల్స్,మరియు లెదర్ ఉత్పత్తులకు, ఆక్వా రంగానికి యూరప్ మార్కెట్‌లో మంచి అవకాశం లభిస్తుంది. ఈ ఒప్పందం వల్ల తయారీ రంగం (Manufacturing) మరియు సర్వీసెస్ రంగంలో వేలాది కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఒక అంచనా.

ఇదే గాక విద్యార్థుల విదేశీ విద్యకు అమెరికా కు ప్రత్యామ్నాయంగా… ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, లాంటి దేశాల్లో ఉన్న అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ యూనివర్సిటీ లలో అవకాశం లభిస్తుంది. దీని పై పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉన్నాయి.

ప్రస్తుతం చర్చలు ముగిసి ఒప్పందం ఖరారైంది. దీనికి సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియలు ముగిసిన తర్వాత, EU పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత… 2027 నుండి ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రధాని మోదీ దీనిని “మదర్ ఆఫ్ ఆల్ డీల్స్” (అన్ని ఒప్పందాల్లోకీ గొప్పది) గా అభివర్ణించారు, ఎందుకంటే ఇది ప్రపంచ జీడీపీలో రమారమి 25% వాటా ఉన్న రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలను కలుపుతుంది. అందుకే ఆయన అలా వ్యాఖ్యానించారు.

ఇప్పుడు అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి, అని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. భారత్ ఏ కోశానా లొంగడం లేదు అని అమెరికా లోని పలు మీడియా సంస్థలు ద్వారా వార్తలు వస్తున్నాయి. భారత్ ఏ కోశానా స్పందించడం లేదు.

Suresh Thota