వార్తలు

మస్కట్లో మహిళ వేదనకు స్పందించిన పవన్ కళ్యాణ్

Published by
Suresh Thota

“ఉదర పోషనార్ధం బహుకృత వేషం” ” కూటి కోసం కోటి విద్యలు” ఇవి మనం తరచూ వింటుంటాము. ఆకలి తీర్చుకోవడానికి, కుటుంబ పోషణ కోసం మనిషి తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, అవసరాన్ని బట్టి వివిధ పనులు చేస్తుంటాడు, దానికోసం ఎంత దూరమైన వెళతాడు. అంతా బాగుంటే పరవాలేదు….. కాని ఎందరో అభాగ్యులు ఖండాంతరాలు దాటి వెళ్ళి, అక్కడ ఇమడలేక రాలేక కొంతమంది చేతిలో ఇరుక్కుపోయిన వాళ్ళు కొందరైతే, విగత జీవులై వచ్చినవారు కొందరు…. అలాంటి ఒక అభాగ్యరాలు రోదన, విని అరణ్య రోదన కాకుండా కాపాడటానికి నడుం బిగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను సోషల్ మీడియాలో వేనోళ్ళ పొగుడుతున్నారు.

విదేశాల్లో కుటుంబ పోషణ కోసం పోయిన ఒక తెలుగు మహిళ ఆవేదన ఇది. ఒమాన్ మస్కట్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం గ్రామానికి చెందిన “దూదేకుల షెహనాజ్” పంపిన వీడియో సందేశం “పవన్ అన్నా కాపాడన్నా” అంటూ అర్థించిన ఆ స్త్రీ మూర్తి ఆవేదన ఆంధ్రప్రదేశ్ “ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌”ను కదిలించింది. తక్షణమే ఆమెను స్వదేశానికి రప్పించే చర్యలు ప్రారంభించి, మానవతావాద రాజకీయాలకు కొత్త అర్ధం చెప్పారు.

కుటుంబ బాధ్యతల కోసం మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్న షెహనాజ్, యజమాని వేధింపులకు గురైంది. బాత్‌రూమ్‌లో దాక్కుని సోషల్ మీడియాలో పంపిన వీడియో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. “ఒమాన్‌”లో 6.62 లక్షల భారతీయులు ఉన్నారు, వీరిలో భారీగా తెలుగు వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అక్కడ ఉపాధి నిమిత్తం ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో, ఈ ఘటన ద్వారా గల్ఫ్ దేశాల్లో భారతీయ మహిళల భద్రత పై ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇటీవల ఒమాన్ వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రవాస భారతీయుల ను మరింత ఆందోళన కు గురిచేస్తున్నాయి.

ఈ మహిళ వీడియో చూడగానే పవన్ కళ్యాణ్ వెంటనే చర్యల కు ఉపక్రమించారు. ఉపముఖ్యమంత్రి కార్యాలయ, పేషీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. షెహనాజ్ భర్త ద్వారా “ఒమాన్” ఏజెంట్‌ను సంప్రదించి, భారత విదేశాంగ శాఖ (MEA), మస్కట్ భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు. మొత్తం ప్రక్రియను నిరంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆమెను ఎలాగైనా సరే, సురక్షితంగా తీసుకురావాలని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం దౌత్య యంత్రాంగంతో సమన్వయం చేసుకునే సామర్థ్యాన్ని చాటి చెబుతుంది.

“ఒమాన్‌”లో లక్షలాది తెలుగు కుటుంబాలు ఉన్నాయి. ఇటీవల ఇరాన్ హెచ్చరిక కాల్పులు, గల్ఫ్ గగనతల మూతలు భారతీయులను ఆందోళనకు గురిచేశాయి. MEA హెల్ప్‌లైన్‌లు, ఎంబసీ అడ్వైజరీలు జారీ అయినప్పటికీ, వ్యక్తిగత సంక్షోభాల్లో రాష్ట్ర నేతల స్పందనలు కీలకం.

ఈ ఘటన రాజకీయ నేతలు సోషల్ మీడియా ఆవేదనలను, వాటికి స్పందించే తీరు ను చెబుతుంది. పవన్ కళ్యాణ్ చర్యలు వ్యక్తిగత ప్రజాస్పందన కోసం కాకుండా, బాధ్యతాయుతమైన ప్రభుత్వ రక్షణ వ్యవస్థల అవసరాన్ని చాటి చెబుతున్నాయి. గల్ఫ్ లో ఉన్న భారతీయుల కోసం రాష్ట్ర-కేంద్ర సమన్వయ హెల్ప్‌లైన్‌లు, ప్రీ-స్క్రీనింగ్ ఏజెంట్ రెగ్యులేషన్లు అవసరాన్ని తెలియజేస్తున్నాయి. షెహనాజ్ విషయంలో విజయం సాధిస్తే, ఇది లక్షలాది ప్రవాసులకు ఆశాకిరణంగా మారుతుంది.

ముగింపు: “అందరూ రాజకీయ నాయకులే కాని మనసు ఉన్న రాజకీయ నాయకులు కొందరే”… అందులో అటువంటి మనసు ఉన్న నాయకుడు “పవన్ కళ్యాణ్”.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.