ఆంధ్ర ప్రదేశ్

చెప్పడం కాదు… చేసి చూపించడం ఇదే పవన్ కళ్యాణ్ నైజం…

Published by
Suresh Thota

అధికార పీఠం దక్కగానే ఆడంబరాలకు పోవడం భారత దేశంలో సహజం. డజన్ల కొద్దీ వాహనాల కాన్వాయ్, సైరన్ల మోత, ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయిన నేటి వర్ధమాన రాజకీయాల్లో… ప్రస్తతం ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వలన, ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా మారిపోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ మొన్న హైదరాబాద్ లో ఒక ప్రకటన చేశారు. బంగారం ఒక సంవత్సరం కొనుగోలు చేయొద్దని, వంటనూనె పొదుపుగా వాడమని, పెట్రోల్, డీజిల్, మొదలగునవి జాగ్రత్తగా వాడమని, అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడమని పలు సూచనలు చేశారు.

ఆయన సూచన చేయడమే కాక, తన కాన్వాయ్ లో వాహనాలు తగ్గించమని తన భద్రత చూసుకునే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆయన సూచనలతో ఒక కొత్త ఒరవడి మొదలైంది. “చెప్పడం కాదు.. చేసి చూపించడం”. దీనినే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వెంటనే తన కాన్వాయ్ విషయంలో తగు చర్యలు తీసుకున్నారు. తాను కూడా పొదుపు పాటిస్తూ మిగతా మంత్రులకు, అధికారులకు, మార్గదర్శిగా నిలుస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా తాను పాటిస్తుండగా, ఆయనను అనుసరిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు కేవలం ఆ దేశాలకే పరిమితం కాలేదు. గ్లోబల్ ఎకానమీలో చమురు ధరల సెగ ప్రపంచ దేశాలన్నింటికీ తగులుతోంది. భారత్ వంటి అత్యధిక చమురు దిగుమతి చేసుకునే దేశంపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు రాకముందే మేల్కొనాలని, ఇంధన పొదుపు పాటించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు వెనుక ఒక దార్శనికత ఉంది. అయితే, కేవలం ప్రజలకు ఉపదేశాలు ఇచ్చి వదిలేయకుండా, తన కాన్వాయ్‌ను తగ్గించుకుంటూ ఆయన స్వయంగా ఆచరించి చూపారు.

రాష్ట్రంలో అదే స్పూర్తిని కొనసాగిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతానికి కుదించాలని ఆయన తీసుకున్న నిర్ణయం సామాన్యమైనది కాదు. ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని తగ్గించడం, తద్వారా ఇంధన వనరుల సంరక్షణలో భాగస్వామ్యం మరియు ఆర్ధిక పొదుపు. సుదీర్ఘ కాన్వాయ్‌ల వల్ల ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందుల నుండి సామాన్యుడికి విముక్తి.

నాయకులు తమ విలాసాలను త్యాగం చేస్తూ అడుగులు వేస్తున్నప్పుడు, పౌరులుగా మనం ఎంతవరకు స్పందిస్తున్నాం అనేది కూడా ముఖ్యం. అవసరం లేకున్నా వాహనాలు వాడటం, విచ్చలవిడిగా ఇంధనాన్ని వృధా చేయడం వంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని మనం గుర్తించాలి. రాజకీయ నాయకులు మారాలి అని కోరుకునే సమాజం, ఒక నాయకుడు మారుతున్నప్పుడు అతనికి అండగా నిలవాలి. ఆ స్పూర్తిని అందిపుచ్చుకోవాలి.

​ముగింపు: అధికారం అంటే చలాయించడం కాదు.. బాధ్యతగా నడచుకోవడం అని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. సంక్షోబాలు ఎదురైనప్పుడు, ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవడం ఉత్తమం. ఈ కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను తగ్గించడం కాదు.. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని ఇంకా తగ్గించే ప్రయత్నం చేయడం కూడా ఒక గొప్ప సంకల్పం… ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇదే ప్రజాస్వామ్యం గొప్పదనం.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.