తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన Vijay నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో ఘన విజయం సాధించింది. బుధవారం తమిళనాడు శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీతో గెలుపొందింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై సభ్యుల మధ్య చర్చ జరిగింది. చర్చ ముగిసిన తర్వాత స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. సాధారణ వాయిస్ ఓటింగ్కు భిన్నంగా ఒక్కో ఎమ్మెల్యే పేరును పిలుస్తూ వారి అభిప్రాయాన్ని నమోదు చేయడం సభలో ఆసక్తికరంగా మారింది.
బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా మొత్తం 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా, వ్యతిరేకంగా 22 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో టీవీకే ప్రభుత్వం మెజార్టీని సులభంగా నిరూపించుకుంది. బలపరీక్ష జరుగుతున్న సమయంలో డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అదేవిధంగా అన్నాడీఎంకేకు చెందిన కొందరు రెబల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం విశేషం.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. పార్టీ అధినేత విజయ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు డీఎంకే 59 స్థానాలు, అన్నాడీఎంకే 47 స్థానాలు దక్కించుకున్నాయి.
ఇక కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకోగా, పీఎంకే 4, ఐయూఎంఎల్ 2, సీపీఐ 2, వీసీకే 2, సీపీఎం 2 స్థానాల్లో విజయం సాధించాయి. భాజపా, డీఎండీకే, ఏఎంఎంకే పార్టీలకు ఒక్కో స్థానం లభించింది.
అసెంబ్లీలో బలపరీక్ష విజయవంతంగా పూర్తి కావడంతో తమిళనాడులో విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం మరింత బలపడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.