రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్ర ఐటి, రైల్వేలు, కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్ను భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో రాష్ట్రం చేపడుతున్న ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్పై లోకేష్ సమగ్ర వివరాలు అందించారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా ఇంటిగ్రేషన్ సిస్టమ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, AI & డీప్ టెక్నాలజీ, విజువల్ ఇంటెలిజెన్స్, పీపుల్ పర్సెప్షన్, పబ్లిక్ అలర్ట్ ప్లాట్ఫాంల వినియోగంపై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్లాట్ఫాంలు రాష్ట్ర పరిపాలనలో ఎలా సహాయపడుతున్నాయి, ప్రజా సేవల అందజేతలో పారదర్శకత ఎలా పెరుగుతోందో వివరించారు.
లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, కేంద్రం నుంచి మరింత సహకారం లభిస్తే రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఆయన విజన్కి అనుగుణంగా కొత్త స్టార్టప్స్, టెక్ కంపెనీలను రాష్ట్రంలోకి ఆకర్షించే చర్యలు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు.
అంతకుముందు, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్ను లోకేష్ న్యూఢిల్లీలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఆయన విజయం రాష్ట్రానికి, దేశానికి మరింత బలాన్నిస్తుందని ఆకాంక్షించారు.
లోకేష్ ఈ పర్యటన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సాంకేతిక అభివృద్ధి చర్యలను జాతీయ స్థాయిలో ప్రదర్శించడమే కాకుండా, కేంద్రంతో సహకారం మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యం స్పష్టమైంది. టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్, ఇన్నోవేషన్ రంగాల్లో దేశానికి మోడల్ స్టేట్గా నిలవాలని ఆయన సంకల్పాన్ని మరోసారి వెల్లడించారు.