ఆంధ్ర ప్రదేశ్

దావోస్‌లో నారా లోకేష్ కీలక భేటీలు… విశాఖను డేటా సెంటర్, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముందడుగు

Published by
Rahul N

ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ, డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh దావోస్ వేదికగా కీలక భేటీలు నిర్వహించారు. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్, డేటా సెంటర్ సర్వీసుల రంగంలో పేరెన్నికగన్న అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ Iron Mountain ప్రెసిడెంట్ & సీఈవో William L. Meaneyతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, నేషనల్ లెవల్ డేటా సెంటర్ హబ్‌గా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యవంతమైన వర్క్‌ఫోర్స్ అందుబాటులో ఉందని, గ్లోబల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే అవకాశాలు ఉన్నాయని వివరించారు. భారత్‌తో పాటు ఏపీఏసీ (APAC) డేటా సెంటర్లకు మద్దతుగా విశాఖపట్నంలో రీజనల్ టెక్నాలజీ ఆపరేషన్స్ హబ్ ఏర్పాటు చేయాలని ఐరన్ మౌంటైన్ యాజమాన్యాన్ని మంత్రి కోరారు.

ఇదే క్రమంలో, ఐటీ దిగ్గజ సంస్థ Cognizant ఉన్నతస్థాయి నాయకత్వంతోనూ మంత్రి నారా లోకేష్ దావోస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ సింగిశెట్టి, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ జతిన్ దలాల్, ప్రెసిడెంట్ అమెరికాస్ సూర్య గుమ్మడి పాల్గొన్నారు.

సమావేశంలో మంత్రి లోకేష్ విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే, ఐటీ రంగానికి అవసరమైన నైపుణ్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, విశాఖలో డెడికేటెడ్ సెంట్రలైజ్డ్ స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కాగ్నిజెంట్ ఉన్నతస్థాయి బృందానికి సూచించారు.

దావోస్ వేదికగా నారా లోకేష్ నిర్వహిస్తున్న ఈ వరుస సమావేశాలు, ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ డేటా సెంటర్ మరియు ఐటీ ఇన్నోవేషన్ డెస్టినేషన్‌గా నిలబెట్టే దిశగా కీలకంగా మారుతున్నాయని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Rahul N

Recent Posts