మచిలీపట్నం నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ (టీడీపీ) కార్యకర్తలు, నాయకులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని, టీడీపీ ఒక కుటుంబంలా పనిచేస్తుందని లోకేష్ తెలిపారు. పార్టీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు మరియు ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, జోనల్ ఇంచార్జ్ మంతెన సత్యనారాయణ రాజు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, నియోజకవర్గ పరిశీలకులు ఎల్. సాయిరాం ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
లోకేష్ మాట్లాడుతూ, గత ఏడాది కాలంలో టీడీపీ-జనసేన కూటమి సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా “సుపరిపాలనలో తొలి అడుగు – డోర్ టు డోర్ కార్యక్రమం” ను జులై 2 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు.
ప్రజలతో, కార్యకర్తలతో నేరుగా ముఖాముఖీగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లేలా కార్యకర్తలు కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు.