ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ నేతృత్వంలో క్వాంటం యుగం ఆరంభం: విశాఖ సమ్మిట్‌లో వేదికపై ప్రపంచ ప్రసంశ

Published by
Rahul N

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో “Atmanirbhar Quantum – Building India’s Indigenous Quantum Stack in Andhra Pradesh” అంశంపై ఏర్పాటైన ప్రత్యేక సదస్సులో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భారత క్వాంటం విజన్‌ను సాకారం చేసే దిశగా వేగంగా ముందుకు సాగుతున్న తొలి రాష్ట్రాలలో ఒకటిగా ఎదిగిందని చెప్పారు. క్వాంటం మిషన్, యాక్షన్ ప్లాన్, రోడ్‌మ్యాప్‌ను రూపొందించి అమలులోకి తెచ్చిన రాష్ట్రంగా ఏపీ ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు.

అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’ రూపకల్పన ద్వారా దేశంలో కొత్త సాంకేతిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారబోతుందని లోకేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్ పాలసీ (2025–30)ని ఆవిష్కరించారు. క్వాంటం టెక్నాలజీ రంగంలో 23 ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకోవడం మరో ముఖ్యాంశంగా నిలిచింది.

మంత్రి లోకేష్ నాయకత్వం, అమలు సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ పలువురు ప్రతినిధులు అభినందనలు తెలిపారు. “లక్ష్యాలను మాత్రమే కాదు, వాటిని మించి సాధించే నేత లోకేష్. కేవలం మాటలు కాకుండా చేసి చూపించే నాయకత్వం ఇది” అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

ఆస్ట్రేలియా-ఇండియా CEO ఫోరం డైరెక్టర్ జోడి మెకే మాట్లాడుతూ, “లోకేష్ గారి ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ హార్బర్ చూపించాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను చూసినప్పుడు మా ఆశ్చర్యానికి అవధులు లేవు. ఈ రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయి” అని అన్నారు.

అంతేకాక, అమెరికా ప్రతినిధి రిచర్డ్ రోసో మాట్లాడుతూ, “1999 నుంచి చంద్రబాబు గారిని చూస్తున్నాం. అప్పట్లో హైదరాబాదు అభివృద్ధిని ప్రత్యక్షంగా చూశాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మరింత పెద్ద స్థాయి ప్రగతి రాబోతుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు.

సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండురోజులపాటు 410 పెట్టుబడి ఒప్పందాలు, రూ. 9.76 లక్షల కోట్లు, 7.48 లక్షల ఉద్యోగాల అంచనాలు మొదట ప్రకటించినా, మొదటి రోజే ఆ అంచనాలను మించి రికార్డు స్థాయిలో 400 ఒప్పందాల ద్వారా రూ. 11.91 లక్షల కోట్ల పెట్టుబడులు, 13.32 లక్షల ఉద్యోగాలు నమోదు కావడం విశేషం.

సాంప్రదాయ చేనేతను గౌరవిస్తూ ఆస్ట్రేలియా ప్రతినిధి మంగళగిరి నేతన్నలు తయారు చేసిన చేనేత చీరను ధరిస్తూ సభకు హాజరవ్వడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆ ప్రతినిధిని అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, “మా మంగళగిరి నేతన్నల చేనేత చీర కట్టుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

విశాఖ వేదికగా సాగిన ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వర్షం కురిపించడమే కాకుండా, క్వాంటం టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని జాతీయ నేతృత్వ స్థానంలో నిలిపేలా తీర్చిదిద్దిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Rahul N

Recent Posts