తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జలవనరుల అంశాలపై ఢిల్లీలో జరిగిన కీలక సమావేశం అనంతరం రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై వ్యాఖ్యానిస్తూ, రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగిందని చెబుతుండగా, రేవంత్ రెడ్డి మాత్రం “ఆ అంశం చర్చకే రాలేదన్నట్టు” వ్యాఖ్యానించడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యగా హరీష్ ఆరోపించారు. ఒకే రోజు జరిగిన సమావేశంపై రెండు విభిన్న వ్యాఖ్యలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
“తెలంగాణ హక్కులను తాకట్టు పెడతావా రేవంత్ రెడ్డి?” అంటూ ఆయన నిలదీశారు. ఈ కమిటీ ద్వారా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగనుందన్న విషయం తెలిసినప్పటికీ, అందుకు సంతకం చేయడం ఎంతవరకు న్యాయమని హరీష్ ప్రశ్నించారు.
ఢిల్లీలో జరిగిన చంద్రబాబు-రేవంత్ సమావేశంపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. “అర్ధరాత్రి ఢిల్లీలో ఏం ఒప్పందం జరిగిందో ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?” అని నిలదీశారు. ఇది చీకటి ఒప్పందానికి నిదర్శనమని, చంద్రబాబుకి ‘గురుదక్షిణ’ చెల్లించేందుకు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడతున్నారని ఆరోపించారు.