స్వల్ప అస్వస్థతతో గురువారం యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యుల సలహామేరకు శనివారం డిశ్చార్జి అయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో రెండు రోజులపాటు నిర్వహించిన సాధారణ పరీక్షల అనంతరం, ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, కేవలం సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.
వైద్య పరీక్షల ప్రక్రియలో భాగంగా ఒక వారం పాటు విశ్రాంతి అవసరమని, ఆ తర్వాత మరికొన్ని పరీక్షలు చేపట్టాల్సి వుంటుందని యశోద వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు రానున్న గురు, శుక్రవారాల్లో కేసీఆర్ మరల ఆసుపత్రికి వెళ్లనున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే, పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పటికీ, పరీక్షల విరామ సమయంలో కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సాగునీరు, రైతులు, వ్యవసాయం, ఇతర ప్రజా సమస్యలపై సమగ్రమైన సమాచారం తీసుకుంటూ, ఆ దిశగా తగిన సూచనలు అందిస్తున్నారు.