తెలంగాణలో ఇటీవల జరుగుతున్న పాలనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సూటిగా విమర్శలు గుప్పించారు.
“ఏమీ చేసిన్రు అని కాంగ్రెస్కు ఓట్లు వేస్తారు ప్రజలు?” అంటూ ఆయన నిప్పులు చెరిగారు. “రైతుబంధు ఎగ్గొట్టినందుకు రైతులు ఓట్లు వేయాలా? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు నీకు ఓటు వేయాలా?” అంటూ సీఎం రేవంత్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“ఇవాళ తెలంగాణలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. రేవంత్ రెడ్డి, ఆయన తొట్టి గ్యాంగ్ మాత్రమే సంతోషంగా ఉంది,” అంటూ ఆరోపించారు. సీఎం తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా, ఆంధ్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. “బనకచర్ల పేరుతో ఆంధ్రాకు నీళ్లు పంపుతున్నారు, నిధులు ఢిల్లీకి పంపుతున్నారు, ఆయన్ను కాపాడే కొంత మందికి నియామకాలు ఇస్తున్నారు,” అని ఆరోపించారు.
“24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ గారు,” అని గుర్తు చేస్తూ, చేసిన అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని మరచిపోరని స్పష్టం చేశారు. “ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు ఊడదీసి కొట్టాలి అన్న రేవంత్ రెడ్డికి, రైతులు ఎరువులు విత్తనాల కోసం చెప్పులతో లైన్లో నిలబడటం ఏమిటో తెలియదు,” అని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి నిజంగా మళ్లీ పాత రోజులు తీసుకొచ్చాడు, చంద్రబాబు కోవర్డ్ మోడల్లో పనిచేస్తున్న వ్యక్తి అని రేవంత్ రెడ్డి గురించి అన్నారు. అంతేకాక తన గురువు కోసం ఏపీకి నీళ్లు పారుస్తున్న సీఎం రేవంత్ ముమ్మాటికీ కోవర్ట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా, రైతులపట్ల ఎవరు ఏమి చేశారన్న విషయమై ఓ ఓపెన్ డిబేట్కు రెడీ అని ప్రకటించారు. “ప్లేస్, డేట్, టైం రేవంత్ రెడ్డే డిసైడ్ చేయండి,” అంటూ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ లేదని, అందుకే 72 గంటల ప్రిపరేషన్ టైమ్ కూడా ఇస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.