
భావోద్వేగాలు, మిస్టరీ, తండ్రి–కూతురు బంధం కలగలిసి ప్రేక్షకుల మనసును కదిలించే సిరీస్ ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’. ఈ సిరీస్లో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ప్రసాద్ రావుగా, ఉదయ భాను ముఖ్యపాత్రలో నటించగా, ఓటీటీ రైజింగ్ స్టార్ వసంతిక స్వాతి పాత్రలో కనిపించనుంది.
కథలో తండ్రి ప్రసాద్ రావు తన కూతురు స్వాతి కనపడకపోవడంతో ప్రారంభమవుతుంది. ఆ వెతుకులాటలో అతనికి ఎదురయ్యే రహస్యాలు, మోసాలు, అనూహ్య నిజాలు సస్పెన్స్ వాతావరణంలో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. ప్రేమ, కోల్పోవడం, మోసం మధ్య ఉండే సన్నని రేఖలు క్రమంగా కనుమరుగై, తండ్రి మనసులోని బాధ, భయం, అనురాగం కలిసిన భావోద్వేగం ఈ కథకు బలమైన హృదయం అవుతుంది.
అక్టోబర్ 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు.

“మనలో ఉన్న భావోద్వేగాల నుంచే శక్తివంతమైన కథలు వస్తాయి. అలాంటి హృదయానికి హత్తుకునే కథే ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’. తండ్రి ప్రేమ, మానసిక ఒత్తిడి, భయాల మధ్య జరిగే ఈ ప్రయాణం ప్రతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది. దర్శకుడు పోలూరు కృష్ణ సస్పెన్స్ తో కూడిన ఎమోషనల్ కథను చక్కగా తెరకెక్కించారు. రాజీవ్ కనకాల, ఉదయ భాను, వసంతిక అద్భుత నటనతో ఆకట్టుకుంటారు.” అని జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ… “‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’లోని ఎమోషనల్ డెప్త్ నాకు చాలా నచ్చింది. ఇది కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు, తండ్రి–కూతురు మధ్య ఉన్న అమూల్యమైన బంధాన్ని చూపించే కథ. ఈ పాత్రలో నేను కూడా ఒక తండ్రిగా ఆ భావోద్వేగాన్ని అనుభవించాను. అందుకే ఇది యూనివర్సల్గా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.”
నటి ఉదయ భాను చెబుతూ.. “ఈ కథ సస్పెన్స్ థ్రిల్లర్గా మాత్రమే కాకుండా, హృదయాన్ని తాకే ఎమోషనల్ జర్నీగా ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లిగా ఆ భావన నాకు బలంగా కనెక్ట్ అయింది. దర్శకుడు భావోద్వేగం, ఉత్కంఠ రెండింటినీ సమతుల్యంగా చూపించారు.”
భావోద్వేగాలు, ఉత్కంఠ, తండ్రి ప్రేమ కలిసిన ఈ సిరీస్ — కుటుంబ అనుబంధాలను స్పృశించేలా, మనసును కదిలించేలా రూపొందించబడింది.
