
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి అద్దె గృహాల్లోనే నివసిస్తూ వచ్చిన ఆయన, ఇకపై హిందూపురంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.
భార్య వసుంధర దేవితో కలిసి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ ఇంతకాలం సొంత ఇల్లు లేకపోవడం తరచూ చర్చకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్న తాజా నిర్ణయం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
హిందూపుర ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఇల్లు నిర్మించాలని భావించినట్టు ఆయన తెలిపారు. హిందూపురం నియోజకవర్గంతో అనుబంధం తమ కుటుంబానికి ఈనాటిది కాదని… వ్యాఖ్యానించారు.

స్థానిక నాయకులు, అభిమానులు ఈ నిర్ణయం ని హర్షాతిరేకాలతో స్వాగతిస్తుండగా, ఇది కేవలం వ్యక్తిగత గృహ నిర్మాణం మాత్రమే కాకుండా హిందూపురం పై తనకు ఉన్న మమకారానికి నిదర్శనంగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
బాలయ్య మాట్లాడుతూ…. తను నిర్మించే గృహం తనకే కాకుండా, తన కార్యకర్తలు, అభిమానులు, తదితరులు వచ్చిన వారికి కూడా సరిపోయేట్టుగా నిర్మిస్తున్నామని అన్నారు. తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాలం నుండి కూడా… ఈ నియోజకవర్గం తమ కుటుంబాన్ని ఆదరిస్తూనే ఉన్నారు అని, తన తండ్రి మూడు సార్లు ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించగా… తను కూడా ఇప్పుడు మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న అని ఆనందం వ్యక్తం చేశారు.
తన తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి ఛైర్మెన్ గా ఉన్నాను అని, పేదలకు సహాయం చేయడానికి మా కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుంది అని తెలిపారు. తను ఎక్కడ ఉన్నా తన మనసు ఇక్కడే ఉంటుందని, “ఇందుగలడు అందులేడని” పద్యాన్ని మీడియా ముఖంగా వల్లె వేశారు.
