
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన పెళ్లి చేసుకోబోయే యువతి కావ్య రెడ్డి. ఈ సందర్భంగా వీరి రోకా వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కావ్య రెడ్డి నివాసంలో ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు.
ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేనితో పాటు నిర్మాతలు శిరీష్, సాహు గారపాటి, రామ్ ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నాగ వంశీ, కేకే రాధామోహన్, ధీరజ్ మొగిలినేని పాల్గొన్నారు. అలాగే హీరోయిన్ సంయుక్త కూడా ఈ వేడుకలో సందడి చేశారు.
ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి నిశ్చితార్థం మరియు వివాహ తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
సినిమాల విషయానికి వస్తే, ఇటీవల ‘కిష్కింధపురి’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.
