
ప్రత్యూష కేసులో న్యాయం జరిగినట్టేనా…. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ చర్చ మళ్ళీ మొదలైంది. సుప్రీం కోర్టు తీర్పుతో ఈ కేసులో నిందితుడుగా ఉన్న సిద్దార్థ రెడ్డి ని లొంగిపోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ప్రత్యూష కేసు 2002లో తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇది ఆమె మరణానికి సంబంధించిన కేసు. 2002 ఫిబ్రవరి 23న హైదరాబాద్లోని తన నివాసంలో ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి కలసి పురుగుల మందు తాగి ఆత్మహత్య కు ప్రయత్నించారు. కాని ప్రత్యూష మరణించింది. సిద్దార్థ రెడ్డి మరణపు అంచుల వరకు వెళ్ళి దాదాపు 15 రోజులకు పైగా పోరాడి బయటకు వచ్చాడు.
హీరోయిన్ ప్రత్యూష ఇంటర్లో సిద్ధార్థ రెడ్డితో ప్రేమలో పడింది. ఒక కథనం ప్రకారం ఈ ఇద్దరి ప్రేమ ను పెద్దవాళ్ళు ఒప్పుకోలేదని అందువల్ల వీరు ఆత్మహత్యకు ప్రయత్నించారు అని దర్యాప్తు లో తేలింది. ఆమె కెరీర్ ఉన్నతమైన స్థాయిలో ఉండగా ఈ సంఘటన జరిగింది. సీబీఐ దర్యాప్తులో కూల్డ్రింక్లో విషం కలిపి తాగారని తేలిందికాని, అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారణ కాలేదు.
ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఫిర్యాదు మేరకు సిద్ధార్థపై కేసు నమోదు చేశారు. సెషన్స్ కోర్టు ఆత్మహత్య యత్నం కింద 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లగా 2011 లో శిక్షను 2 ఏళ్లకు తగ్గించి, జరిమానాను రూ.50,000కి పెంచింది. సుప్రీంకోర్టు తుది తీర్పు 2026 ఫిబ్రవరి 16న హైకోర్టు తీర్పునే సమర్థించినది. బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. 4 వారాల్లో సరెండర్ కావాలని ఆదేశించింది. పోస్ట్మార్టం, ఫోరెన్సిక్ రిపోర్టులు, ఆధారాలు పరిశీలించి హైకోర్టు తీర్పును అమలు జరపమన్నది. ప్రత్యూష తల్లి సరోజిని దేవి కూతురు మరణానికి కారణమైన సిద్ధార్థ్ రెడ్డి పై కేసు దాఖలు చేసి ఇప్పటికీ 24 సంవత్సరాలు అవుతుంది.
ప్రత్యూష తల్లి సీబీఐ దర్యాప్తు, కోర్టు విచారణల్లో కీలక సాక్షిగా నిలిచి పోరాడింది. తను కూడా ఆధారాలు సేకరించింది. మీడియాతో మాట్లాడుతూ ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నాను అని, సుప్రీంకోర్టు తీర్పుతో తాను సంతృప్తి చెందడం లేదు అని వ్యాఖ్యానించడం గమనార్హం. మీడియాతో మాట్లాడుతూ, తన కూతురు కిరాతకంగా చంపబడిందని, సాక్ష్యాలు తారుమారు చేశారని ఆరోపించింది. తన కూతురుకి పూర్తి న్యాయం జరగాలని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. గతంలో బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ తను సుదీర్ఘ మైన పోరాటం కొనసాగించానని తెలిపింది. సిద్దార్థ రెడ్డినే నా కూతురు చావుకి కారణం… అతనికి యావజ్జీవ కారగాశిక్ష విధించాలని కోరుతున్నది.
కాని ఇక్కడ ప్రత్యూష కేసులో ఆత్మహత్యకి ప్రేరేపించినట్లుగా, దానికి సంబంధించిన కేసులో మాత్రమే శిక్ష పడ్డట్టుగా తెలుస్తుంది.
సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం… గెలిచేదంతా న్యాయమేనా అని ప్రశ్నిస్తున్నారు.
