
సూపర్స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న SS రాజమౌళి ‘వారణాసి’ నుంచి ఆయన బర్త్డే సందర్భంగా స్పెషల్ అప్డేట్ వచ్చింది. సినిమా నుంచి కొత్త వీడియో గ్లింప్స్ వస్తుందని అభిమానులు ఆశించినప్పటికీ.. మేకర్స్ మాత్రం రెండు ప్రత్యేకమైన స్టిల్స్ను విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు.
ఈ స్టిల్స్లో మహేష్ బాబు రుద్ర పాత్రలో చాలా కూల్గా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి తన హీరో క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకంటే ఎంతో పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చడానికి పుట్టిన వ్యక్తి రుద్ర అని, తాను కోరుకోకపోయినా ఒక గొప్ప విధిని మోసుకెళ్లాల్సిన పరిస్థితి అతనిదని రాజమౌళి తెలిపారు.
రుద్ర పాత్రలో తెలివితేటలు, బలహీనత, ఆవేశం వంటి విభిన్న కోణాలు ఉంటాయని రాజమౌళి పేర్కొన్నారు. మహేష్ బాబు తన పాత్రలోని బలంతో పాటు సున్నితమైన భావోద్వేగాలను కూడా అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించారు. దీంతో రుద్ర పాత్రపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

‘వారణాసి’లోని ఈ కొత్త స్టిల్స్ను ఆఫ్రికా షెడ్యూల్ సమయంలో చిత్రీకరించారు. కిలిమంజారో, మసాయ్ మారా ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్లు రాజమౌళి వెల్లడించారు. అక్కడి ప్రకృతి అందాలు, భారీ లొకేషన్లను చూసి తాను ఆశ్చర్యపోయానని, సినిమా కోసం ఉపయోగిస్తున్న 1.43:1 IMAX ఫ్రేమ్ కూడా ఆ విస్తారమైన దృశ్యాలను పూర్తిగా చూపించలేనంత భారీగా ఆ లొకేషన్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
మహేష్ బాబు కంటే ముందు ప్రియాంక చోప్రా జోనాస్ బర్త్డే సందర్భంగా కూడా ‘వారణాసి’ నుంచి ప్రత్యేక స్టిల్స్ను మాత్రమే విడుదల చేశారు. దీంతో ఈసారి మహేష్ బర్త్డేకు కొత్త వీడియో గ్లింప్స్ వస్తుందని అభిమానులు భారీగా అంచనా వేశారు. అయితే మేకర్స్ మరోసారి స్టిల్స్తోనే సరిపెట్టారు.
అయితే ఈ రెండు కొత్త ఫొటోలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్ర వెనుక ఉన్న కథ ఏమిటి? అతడి ప్రయాణం ఎటువైపు సాగుతుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
KL నారాయణ, SS కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
