ఆంధ్రప్రదేశ్ లో తనపై నమోదైన కేసుల్ని కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు నటుడు, దర్శకుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 17వ కేసులు ఈయనపై నమోదై ఉన్నాయి.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి పోసానిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, రిమాండ్ లో భాగంగా రాజంపేట సబ్ జైలుకు తరలించారు.
అంతలోనే ఆయన్ను పీటీ వారెంట్ కింద నరసారావుపేట పోలీసులు అరెస్ట్ చేసి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో రిమాండ్ కింద ఆయన్ను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. గుంటూరు జైలు నుంచి ఆదోని పోలీసులు పీటీ వారెంట్ కింద పోసానిని అదుపులోకి తీసుకొని కర్నూలు తీసుకెళ్లి జడ్జి ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం పోసాని కర్నూలు జైళ్లోనే ఉన్నారు.
ఇలా వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆయన, హైకోర్టును ఆశ్రయించారు. తనపై అన్నీ తప్పుడు కేసులు పెట్టారని, వాటిని కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు పెట్టిన సెక్షన్లు, పోసాని కేసుకు వర్తించవని వాదిస్తున్నారు ఆయన తరఫు న్యాయవాది.