సినిమా వార్తలు

మా కష్టాన్ని దొంగిలిస్తున్నారు.. మీడియా పై ‘హిట్ 3’ డైరెక్టర్ శైలేష్ కొలను అసహనం

Published by
Srinivas

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరిగా గుర్తింపు పొందిన శైలేష్ కొలనూ, ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్‌లో ఇది మూడో భాగం. ఇందులో ప్రముఖ నటుడు నాని ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ‘హిట్ యూనివర్స్’గా పేరొందుతున్న ఈ సిరీస్ మొదటి రెండు భాగాలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో మూడవ భాగంపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమా కథలో పోలీసు దర్యాప్తు, మిస్టరీ, ట్విస్టులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. కాగా, తాజా సమాచారం ప్రకారం, కార్తీ ఈ సినిమాలో కీలక పాత్రలో చివర్లో కనిపించనున్నాడని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇది నిజమైతే, నాల్గవ భాగానికి బలమైన లింక్ ఏర్పడుతుందని అంటున్నారు. ‘హిట్ 4’లో కార్తీ హీరోగా నటించే అవకాశాలపై జోరుగా చర్చ సాగుతోంది నెట్టింట.

అయితే, ఈ వార్తలపై దర్శకుడు శైలేష్ కొలనూ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మీడియా లీకులపై ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ ద్వారా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“సినిమాల్లో ప్రేక్షకులు ఆస్వాదించే ప్రతి ఒక్క మూమెంట్ వెనక ఎన్నో రోజుల పాటు ఓ బృందం కష్టపడుతుంది. వాళ్ల శ్రమను తెరపై చూపించడమే మా లక్ష్యం. కానీ ఈ మధ్య కొన్ని మీడియా హౌజులు ఏ ఆలోచన లేకుండా సినిమాకి సంబంధించిన కీలక విషయాలను బయటపెడుతున్న తీరును చూస్తుంటే బాధగా ఉంది. మొదటగా రిపోర్ట్ చేయాలన్న తపన మంచిదే కానీ, అది సరైందా కాదా అనే అంశాన్ని గుర్తించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులదే. కొన్ని సందర్భాల్లో జర్నలిస్టులు వారి పాత్రను మించి, నైతికతతో నడుచుకుంటూ కొన్ని విషయాలు రిపోర్ట్ చేయకుండా మానేశారు. అలాంటి స్థాయిని ఇక్కడ కొందరికి చూసే అవకాశం లేదు అనిపిస్తోంది. ఇది కేవలం మా కష్టాన్ని మాత్రమే దొంగిలించడం కాదు.., ప్రేక్షకుల అనుభూతిని దోచుకోవడం కూడా” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఆయన ట్వీట్ కు మద్దతు తెలుపుతున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.