
డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్-డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న గాయపడ్డ సింహం సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నటుడు జేడీ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ, “గాయపడ్డ సింహం’లో నేను చేసిన ధర్మా క్యారెక్టర్ ఒక ప్రత్యేకమైన అనుభవం ఇచ్చింది. ఒకే పాత్రలో రెండు వేర్వేరు షేడ్స్ను ఒకేసారి చూపించే అవకాశం రావడం చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఇది సాధారణంగా కనిపించే డ్యూయల్ షేడ్స్ కంటే భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులు సినిమా చూస్తే ఆ మ్యాజిక్ అర్థమవుతుంది” అని తెలిపారు.
ఈ పాత్ర తనకు ఎందుకు ప్రత్యేకమైందో చెబుతూ, “కమల్ హాసన్ గారు చేసిన పాత్రలు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు. అయితే ఈ సినిమాలో యాక్టర్గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని ఒక ప్రత్యేకమైన అవకాశం నాకు దక్కింది” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా గురించి మాట్లాడుతూ, ఇది పూర్తిగా రియలిస్టిక్ టచ్తో పాటు హిలేరియస్ హ్యూమర్ కలిగిన ఎంటర్టైనర్ అని తెలిపారు. “నా పాత్ర పేరు ‘బ్రూటల్ ధర్మ’, కానీ నేను చేసే పనులు ప్రేక్షకులను నవ్విస్తాయి. కథ వినగానే నేను నవ్వుతూనే ఉన్నాను” అని చెప్పారు.
డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపిస్తూ, “కశ్యప్ చాలా కాన్ఫిడెంట్ డైరెక్టర్. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ల అనుభవంతో ఆయన ఒక ప్రత్యేకమైన స్టైల్ తీసుకొచ్చారు. ఇది పూర్తిగా డైరెక్టర్ ఫిల్మ్. ఆయన చెప్పినట్టుగానే మేమంతా చేశారు” అన్నారు.
సినిమాలో పాత్రల గురించి చెప్పుతూ, తరుణ్ భాస్కర్ పోషించిన పాత్రతో పాటు మరికొన్ని కీలక పాత్రలు కథలో ఆసక్తికరంగా కలిసిపోతాయని చెప్పారు. “ఈ సినిమాలో గాయపడింది ఒక్క సింహం కాదు… నేను, తరుణ్ భాస్కర్, ఇంకో సింహం కూడా గాయపడింది. ఆ సింహం ఎవరో త్వరలో తెలుస్తుంది” అని ఆసక్తి పెంచారు.
తన కెరీర్పై మాట్లాడుతూ, మంచి కథలు వచ్చినప్పుడే సినిమాలు చేస్తానని, వేగంగా సినిమాలు చేయడం తనకు అలవాటు కాదని తెలిపారు. అలాగే ఓటీటీ ప్రభావంపై స్పందిస్తూ, “ఇప్పుడు కంటెంట్ బలంగా ఉంటేనే సినిమా థియేటర్స్లో ఆడుతుంది. ప్రేక్షకులకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి” అని చెప్పారు.
