
గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పెడుతూ తమ ప్రేమకథను బహిరంగంగా ప్రకటింటించేసారు విశాల్ – సాయి ధన్సిక జంట. నేడు ఆగస్ట్ 29న తమ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు విశాల్ 48వ పుట్టినరోజు కావడం విశేషం. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను విశాల్ స్వయంగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. “కుటుంబ సభ్యుల సమక్షంలో నేడు మా ఎంగేజ్మెంట్ జరిగింది. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి” అంటూ విశాల్ చేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటోలు కాసేపట్లోనే వైరల్ అయ్యాయి.
ఫోటోలలో విశాల్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, సాయి ధన్సిక అందమైన చీరలో మెరిసింది. ఇద్దరూ ఒకరికి ఒకరు ఉంగరాలు పెట్టుకుంటూ, కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడిపిన క్షణాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం విశాల్ ‘మకుటం’ అనే చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇది ఆయన కెరీర్లో 35వ చిత్రం. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆర్.బి. చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. సీ బ్యాక్డ్రాప్లో, మాఫియా స్టోరీలైన్తో ఈ మూవీ విశాల్కు మరో యాక్షన్ ఎంటర్టైనర్గా రానుందని సమాచారం.
ఇకపోతే, పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
