
నటి అనసూయ భరద్వాజ్ తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులపై పోలీసులను ఆశ్రయించారు. పరువునష్టం, లైంగిక వేధింపులతో పాటు క్రిమినల్ బెదిరింపులపై 42 మందిపై కేసులు పెట్టారు. ఈ కేసులో ప్రముఖ వ్యాఖ్యాతలు, జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు.
అనసూయ ఫిర్యాదులో, డిసెంబర్ 23, 2025 నుంచి తనపై సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)లలో పెద్ద ఎత్తున దాడి మొదలైందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తనను లైంగికంగా కించపరిచేలా డీప్ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 75, 79, 336(4), 351, 356 సెక్షన్స్ కింద అభియోగాలు మోపారు. నా శరీరం, నా దుస్తులు, నా ఇష్టం అంటూనే తన పైన విపరీత వాఖ్యలు చేసిన వారి పైన పెట్టిన కేసులు ఇవి.
నిజానికి ఇది మంచి అవకాశం… ఇంత వరకు సోషల్ మీడియా వేదికగా, ఛానెల్స్ లో జరిగే చర్చ కాస్త, ఇప్పుడు కోర్టు వేదికగా సాగుతాయి. ఇప్పుటి దాకా తనకు ఏమాత్రం సంబంధం లేని విషయంలో అనవసరంగా దూరి, నోటికి ఏది వస్తే అది మాట్లాడి, బాధితురాలిగా నాటకం రక్తి కట్టించుకోవటానికి మాత్రమే, క్రిమినల్ కేసు అనే కొత్త అంకానికి తెర తీసింది ఈవిడ.
దాసరి నారాయణరావు లేని లోటు ఖచ్చితంగా కనబడుతున్నది. ఆయన ఉంటే ఈమె చేతనే సమాజానికి క్షమాపణ చెప్పించేవారు. ఆయన లేరు కనీసం మిగతా పెద్దలు ఎవ్వరూ ఈ సమస్యని పరిష్కరిద్దాం అనుకోవడం లేదో… లేక ఈవిడ వినడం లేదో తెలియదు. పోనీ దాసరి నారాయణరావు “అద్దాల మేడ” సినిమాలో నటీనటుల జీవితం గురించి చెప్పే క్లైమాక్స్ చూసినా అవగతమవుతుంది… ఎందుకంటే అద్దాల మేడల్లో ఉండేది మీరే గనుక.

ఏదైనా ప్రయాణంలో మన పక్కన ఎవరైనా కూర్చుని పుల్లటి మామిడి కాయను ఉప్పు, కారంతో నంజుకుంటూ తింటుంటే మన నోటిలో లాలా జలం ఊరడం సహజం. నాకు నోటిలో నీళ్లు ఊరుతున్నాయి… పక్కకు వెళ్ళి తినండి అని అనగలమా… నేను నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా మీరు మాత్రం… మీ అమ్మను, చెల్లెగా భావించండి అంటే ఎట్లా.
మొన్న నటుడు హర్షవర్ధన్ ఒక ఇంటర్వ్యూ లో ఊళ్ళో దొంగలు ఉన్నారు అంటే… మన ఇల్లు పదిలంగా ఉంచుకోవాలి… దొంగలు మనసు మారుస్తా అంటే కుదురుతుందా అన్నాడు… ఆయన మాటలు నిజమే కదా.
ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ A G గార్డినర్ ఒక ఫేమస్ వ్యాసం “On the Rule of the Road”లో స్వేచ్ఛ గురించి చక్కగా రాసారు… “వ్యక్తిగత స్వేచ్ఛ అనేది సమాజ నియమాలను అంగీకరించి, ఇతరుల హక్కులను గౌరవిస్తూ జీవించడమే, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండే స్వేచ్ఛనే నిజమైన స్వేచ్ఛ” అని అంటే రోడ్ మీద బైక్ పై వెళ్ళడం మన హక్కు… కాని పాములా వంకర టింకరగా నడుపుతాను అంటే… సమాజం ఒప్పుకోదు… అర్ధం చేసుకున్న వారికి అర్థం అయినంత.
ఇక శివాజీ వ్యాఖ్యలు విషయంలో…
“పిలవని పేరంటానికి వచ్చిన ముత్తైదువ తాంబూలం అందుకోవడానికి ముందు నిలబడ్డట్టుగా” ఈవిడ ముందుకు వచ్చింది. నిజానికి, ఈమె ఈ అంశం ద్వారా ప్రచారం కోరుకుంటున్నది అనేది సుస్పష్టం. పైగా తన వ్యాఖ్యలు సమర్థించుకుంటూ, వ్యక్తిగత, ప్రాథమిక హక్కులు అంటూ మాట్లాడుతున్నది. వివిధ రకాల మాధ్యమాల్లో ఆవిడ పెట్టిన పోటోలు మాత్రమే వైరల్ అవుతున్నాయి. రేపు కోర్టులో ఆవిడ పెట్టిన ఫోటోలనే చూపిస్తారు.
40 మందికి పైగా కేసులు పెట్టింది. ఎవరి కేసు వారిదే కాబట్టి, ఎవరి వాదన వారిదే , ఇప్పుడు ఈ కేసులో మొదటి సాక్షిగా, ఈమెనే తనకు జరిగింది అని చెప్పబడుతున్న అంశాల పైన సాక్ష్యం చెప్పాలి. అప్పుడు వచ్చే చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బలమైన న్యాయవాదులు ఉంటేనే సుమా… ఇటువంటి కేసులు, కేవలం మూర్ఖులు మాత్రమే వేస్తారు. ఏ మాత్రం బుద్ధి, జ్ఞానం,వివేకం ఉన్నవారు వేయరు. జరిగిందేదో జరిగింది అంటూ, సర్దుకుపోతారు. ఇలా కోర్టుకి వెళ్లడం కూడా మంచిదే… ఈ కేసు ఎలానూ నిలబడదు… కాని సమాజానికి ఈ రకంగానైనా మన దేశ సంస్కృతి, వస్త్ర ధారణ, దాని విశిష్టతపై మరొకసారి చర్చ జరుగుతుంది. తీర్పు ఏ విధంగా వస్తుందో చూడాలి.
ఎవరినైనా చూస్తే… సీతాదేవి లా ఉంది… మహాలక్ష్మిలా ఉంది అని అనిపించాలి కాని… ఏమిటి ఈ రచ్చ.
