తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గడిచిన 48 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కాబట్టి వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వాళ్లను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్, ఈ సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని విమర్శించారు కేటీఆర్. తాజాగా 36వ సారి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి, కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి ఇప్పటికీ హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేరని.. బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయలేదని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు.