ఆంధ్ర ప్రదేశ్

బుల్లెట్‌ప్రూఫ్ కారు వదిలి ఆటోలో ప్రజల మధ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు

Published by
Rahul N

ప్రజల మధ్యకే చేరి, వారి సమస్యలను దగ్గరగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన వినయాన్ని చాటుకున్నారు. జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో శుక్రవారం జరిగిన ప్రజా వేదికకు బుల్లెట్‌ప్రూఫ్ కారు వదిలి సాధారణ ఆటోలో ప్రయాణం చేసి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గూడెం చెరువు గ్రామంలో వితంతువైన ఉల్సాల అలివేలమ్మ ఇంటికి వెళ్లి వితంతు పెన్షన్‌ను అందజేశారు. ఆమెతోపాటు కుటుంబ సభ్యులతో కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న చేనేత మగ్గాన్ని పరిశీలించి, చేనేత రంగం గురించి విచారణ చేశారు.

అనంతరం అలివేలమ్మ చిన్న కుమారుడు జగదీష్ నడిపిన ఆటోలో ప్రయాణించి ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఆటోలో రావడం చూసి గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఆయనను ఆత్మీయంగా స్వాగతించారు.

గ్రామ ప్రజలతో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడమే నా ఉద్దేశ్యం. ప్రతి వర్గం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం,” అని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి సాధారణ ప్రజలా ఆటోలో ప్రయాణం చేయడం, వారి మధ్య కలిసిపోవడం స్థానికులలో విశేష ఉత్సాహాన్ని నింపింది. ఆయనతో మాట్లాడేందుకు, సమస్యలు చెప్పేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Rahul N