‘రైతాంగ సమస్యలపై కనీస అవగాహన లేని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. ఆయన హయాంలో అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అటువంటి వ్యక్తి రైతు సమస్యలపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంద’ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో 20 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే కనీసం నష్టపరిహారం అందించలేదని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు ఆదుకుంటామని చెప్పిన వ్యక్తి.. తన ఐదేళ్ల పాలనలో కనీసం రూ.50 కోట్లు కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే జగన్ విమర్శలు చేస్తున్నారని, అలాంటి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
కాకినాడలో సందర్శించిన మనోహర్.. “వైసీపీ ప్రభుత్వం గత ఏడాది రైతుల నుంచి 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లోనే 48.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. అంటే వైసీపీ కంటే 11 లక్షల మెట్నిక్ టన్నులు అదనంగా కొనుగోలు చేశాం. మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దాదాపు రూ.11 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు అప్పజెప్పి ఇంటికెళ్లేలోపు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. రైతుల కష్టానికి తక్షణ ఆర్థిక మద్దతు అందించాం.”అన్నారు.