ఎంతోమంది ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం ఈ నెల్లోనే మొదలుకానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కడపలో 27, 28, 29 తేదీల్లో మహానాడు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా మిగిలిన అన్ని కమిటీలూ వేయాలని సూచించారు. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీలు వేయనున్నట్లు వివరించారు. రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రపంచం దృష్టి అమరావతి మీదకు మళ్లిందన్నారు.
జూన్ 12వ తేదీకి కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గుజరాత్ మోడల్ ను రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఇక ‘తల్లికి వందనం’ కింద చదువుకునే పిల్లలకు పాఠశాలల ప్రారంభానికి ముందే రూ.15 వేల చొప్పున అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. “సామాజిక న్యాయం పాటిస్తూ పదవులు ఇస్తున్నామని.. ఇప్పటికే మెజార్టీ కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఏఎంసీ ఛైర్మన్ పదవులు భర్తీ చేశామని గుర్తుచేశారు. దీపం-2 కింద కోటి మందికి పైగా లబ్దిదారులకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తిచేస్తామని అన్నారు బాబు.